ఆంధ్ర జట్టుకు రెండో విజయం

by Harish |
ఆంధ్ర జట్టుకు రెండో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూపు-బి మ్యాచ్‌లో సోమవారం చత్తీస్‌గఢ్‌పై 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేయగా.. చత్తీస్‌గఢ్ 262 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్‌ను సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 150/2 వద్ద ఆంధ్ర జట్టు డిక్లేర్డ్ ఇచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 169 పరుగులు కలుపుని చత్తీస్‌గఢ్ ముందు 320 పరగుల టార్గెట్ పెట్టింది. ఛేదనకు దిగిన చత్తీస్‌గఢ్‌ను ఆంధ్ర బౌలర్లు 193 పరుగులకే ఆలౌట్ చేశారు. ఓపెనర్ ఏక్‌నాథ్ కెర్కర్(76), కెప్టెన్ అమన్‌దీప్(67) రాణించినప్పటికీ.. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. ముగ్గురు ఖాతా తెరవకపోగా..మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్రశాంత్ కుమార్(3/21), నితీశ్ రెడ్డి(3/36) ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. పృథ్వీ రాజ్ 2 వికెట్లతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదిన టీమ్ ఇండియా బ్యాటర్ హనుమ విహారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. గత మ్యాచ్‌లో ఆంధ్ర టీమ్ అసోంపై నెగ్గిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు జరిగే తదుపరి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడనుంది.

Next Story

Most Viewed