రష్యాతో యుద్ధంలో కుర్క్సు ప్రావిన్స్ లోనే 15,300 ఉక్రెయిన్ సైనికుల మరణం

by Y. Venkata Narasimha Reddy |
రష్యాతో యుద్ధంలో కుర్క్సు ప్రావిన్స్ లోనే 15,300 ఉక్రెయిన్ సైనికుల మరణం
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య రెండున్నరేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో రెండు దేశాలకు చెందిన సైనికులు, వలంటీర్లు, పౌరుల మరణాలు వేలాదిగా సాగుతున్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో రష్యాకు సంబంధించి 70,112 మంది సైనికులు, వలంటీర్లు ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారికంగా గుర్తించారు. ఇందులో 13,781 మంది వలంటీర్లు ఉన్నారు. వాస్తవానికి ఈ మరణాలు మరింత ఎక్కువే ఉంటాయని అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రష్యా దాడుల్లో యుద్ధభూమిలో 45వేలకు పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని, అయితే అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఆ సంఖ్య కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుందంటున్నారు. తాజాగా ఉక్రెయిన్ రష్యా పశ్చిమ సరిహద్దులోకి చొరబడి కుర్క్సు ప్రావిన్స్ లో వెయ్యి కిలోమీటర్ల ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగా ఉక్రెయిన్ సైనికులను వెళ్లగొట్టేందుకు రష్యా సైన్యం చేపట్టిన ఎదురుదాడుల్లో గడిచిన 24 గంటల్లోనే 370 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రి ప్రకటించారు. ఇప్పటివరకు కేవలం కుర్క్సు ప్రావిన్స్ పరిధిలో సాగిన యుద్ధంలోనే 15,300 మంది ఉక్రేనియన్ సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉక్రెయిన్ రష్యాపై డ్రోన్లతో నిరంతరం దాడి చేస్తోంది. రష్యా వైమానిక రక్షణ దళాలు ఉక్రెయిన్ డ్రోన్ దాడులను అధిక శాతం విఫలం చేశాయి.

Next Story

Most Viewed