ఒకే వేదికపై సీఎం రేవంత్‌, కేటీఆర్.. పార్టీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్

by karthikeya |
ఒకే వేదికపై సీఎం రేవంత్‌, కేటీఆర్.. పార్టీ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఈ అరుదైన ఘటనకు రవీంద్రభారతి వేదిక కాబోతోంది. ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు నిర్వహించబోతున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఈ దృశ్యం కనిపించబోతోంది. కాగా.. సీతారాం ఏచూరి 12వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్ని పార్టీల ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. తమ్మినేని ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఈ కార్యక్రమానికి ఒకరి తర్వాత ఒకరు వస్తారా..? లేదా ఒకేసారి వేదికపై కనిపిస్తారా..? అనేది ఇంకా తెలియడం లేదు. అలాగే ఒకవేళ ఒకేసారి హాజరైతే ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతుందా? లేకుంటే సంస్మరణ సభ కాబట్టి రాజకీయ విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తపడతారా? అనే విషయంపై ఇరు పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సీతారాం ఏచూరి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడం వల్ల వీరిద్దరూ ఈ అంశానికే పరిమితమయ్యేలా తమ్మినేని వీరభద్రం చొరవ తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు మరికొన్ని పార్టీల రాష్ట్ర నేతలకూ ఆహ్వానాలు అందాయి. వారంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.

Next Story