ఎట్టకేలకు దిగొచ్చిన సింగరేణి యాజమాన్యం

by  |
ఎట్టకేలకు దిగొచ్చిన సింగరేణి యాజమాన్యం
X

దిశ, కరీంనగర్: ఎట్టకేలకు కార్మిక సంఘాల పోరాటం ఫలించింది. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సింగరేణి యాజమాన్యంతో యూనియన్ నాయకులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. మూడు సార్లు చర్చలు విఫలం కాగా, నాలుగో సారి జరిగిన మీటింగ్ ఫలప్రదంగా ముగిసింది. ముందుగా చెప్పిన పరిహారం కాకుండా రూ.40లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. అంతకుముందు కార్మిక సంఘాల నాయకులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రూ.1కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..రామగుండం మండల పరిధిలోని ఓసీపీ-1లో జరిగిన పేలుళ్లలో నలుగురు కార్మికులు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని కార్మిక సంఘాల నాయకులు, వారి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బుధవారం మేనేజ్మెంట్ మరియు కార్మిక సంఘాలు, అధికార పార్టీ నాయకుల మధ్య 24 గంటల పాటు పరిహారం విషయంపై చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన విషయాలను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియాకు వెల్లడించారు. చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షలు, ఉద్యోగం ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించిందన్నారు. అలాగే వారి కుటుంబాలకు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వైద్య సాయంతో పాటు, పిల్లలకు విద్య పరంగా కూడా సాయం అందించాలని నిర్ణయించినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయా కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలు చివరకు సఫలం అయ్యాయని, ప్రమాదంలో బాధిత కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోవడం విచారకరమన్నారు. అయితే గాయపడిన వారికి తీవ్రతను బట్టి పరిహారం అందించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.


Next Story

Most Viewed