కొనసాగుతున్న మార్కెట్ల ర్యాలీ

by Shamantha N |
కొనసాగుతున్న మార్కెట్ల ర్యాలీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు అలుపులేకుండా దూసుకెళ్తున్నాయి. మంగళవారం సైతం ర్యాలీని కొనసాగించిన మార్కెట్లు వరుసగా ఐదో సెషన్‌లో అధిక లాభాలను దక్కించుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు మార్కెట్ల జోరుకు తోడ్పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ, కరోనాను నియంత్రించేందుకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటంతో మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ బలంగా కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వరుస రికార్డులతో ర్యాలీ చేస్తున్న మార్కెట్లు డిసెంబర్‌లో మొత్తం 20 సెషన్లలో 14 సార్లు రికార్డులను సృష్టించింది.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 259.33 పాయింట్ల లాభంతో 47,613 వద్ద ముగియగా, నిఫ్టీ 59.40 పాయింట్లు లాభపడి 13,932 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంకులు అధికంగా 2 శాతం వరకు పుంజుకోగా, ఫైనాన్స్, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు బలపడ్డాయి. మెటల్, మీడియా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, నెస్లె ఇండియా, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, డా.రెడ్డీస్, రిలయన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.38 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed