ఊగిసలాటలో మార్కెట్లు..స్వల్ప నష్టాలు!

by Harish |
ఊగిసలాటలో మార్కెట్లు..స్వల్ప నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 వ్యాప్తితో నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయి లాభాలను సొంతం చేసుకున్నాయి. అయితే, బుధవారం మార్కెట్లు కాస్త కన్ఫ్యూజన్‌కు గురై ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై మళ్లీ లాభాల్లోకి మారాయి. అమెరికాలో కరోనా మరణాలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనబడింది. ఈ పరిణామాలకు తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రశ్నించడం, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆర్థిక ఉద్దీపన పథకాలు వెల్లడిస్తుండటంతో ఇన్వెస్టర్లు నిలకడగా వ్యవహరించారు. మధ్యాహ్నం సమయంలో మార్కెట్లు అత్యధికంగా 2500 పాయింట్ల వరకూ లాభపడినప్పటికీ తర్వాత ఊగిసలాటకు లోనై స్వల్ప నష్టాలతో మార్కెట్లు ముగిశాయి.

మార్కెట్లు మిగిసే సమయానికి సెన్సెక్స్ 173.25 పాయింట్ల నష్టంతో 29,893 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 43.45 పాయింట్లు కోల్పోయి 8,748 వద్ద ముగిసింది. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడి రూ. 76.37 వద్ద ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక లాభాలతో ట్రేడవ్వగా, టీసీఎస్, టైటాన్ నష్టాల్లో కదలాడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

TAgs: sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story

Most Viewed