వారాంతం లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లో మార్కెట్లు!

by Harish |
వారాంతం లాభాల స్వీకరణతో భారీ నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీగా నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీన పడటంతో పాటు దేశీయంగా షేర్లు డీలాపడటంతో సూచీలు నీరసించాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనై భారీ నష్టాలను చూశాయని నిపుణులు తెలిపారు. శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన తర్వాత అమ్మకాల ఒత్తిడి నెమ్మదిగా పెరిగింది. మిడ్‌సెషన్ సమయానికి కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికీ అనంతరం భారీ నష్టాలను అధిగమించలేక పోయాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 549.49 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద ముగిసింది. నిఫ్టీ 161.90 పాయింట్లు నష్టపోయి 14,433 వద్ద ముగిసింది. నిఫ్టీలో అధికంగా ఐటీ, ఫార్మా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు డీలాపడగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆటో రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రమే లాభపడగా, మిగిలిన అన్ని రంగాలు దిగజారాయి. ముఖ్యంగా టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, హిందూస్తాన్ యూనిలీవర్, డా రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.07 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed