YS Sharmila: అమరవీరుల స్థూప రూపకర్త యాదగిరినీ కేసీఆర్ మోసం చేసిండు..

by Javid Pasha |
YS Sharmila:  అమరవీరుల స్థూప రూపకర్త యాదగిరినీ కేసీఆర్ మోసం చేసిండు..
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై వైస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అసలు సిసలైన తెలంగాణ వాదులను సీఎం కేసీఆర్ అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రంలో అసలు ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల స్థూప రూపకర్త యాదగిరికి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు తన బిల్లులు ఇస్తుందా అని తొమ్మిదేళ్లుగా 85 ఏళ్ల యాదగిరి ఎదరుచూస్తున్నారని, కానీ కేసీఆర్ ఆయనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంతకంటే దారుణమైన అవమానం తెలంగాణ పోరాట యోధులకు, మేధావులకు, కళాకారులకు వేరే ఉంటుందా అని షర్మిల ప్రశ్నించారు.

‘‘అర్ధ శతాబ్దం సరే, సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యం వహించారనుకుందాం. మరి పదవిలోకి వచ్చి మీరు తొమ్మిదేండ్లు, ఈపాటి చిన్న రుసుము చెల్లించలేరా? మీ దొంగ కాంట్రాక్టర్లకు పైసలు పెంచి మరీ అడ్వాన్సులు ఇస్తారు కదా? ఇక్కడ చేతులు తడపలేరన్న లోకువా! కమీషన్ల కక్కుర్తితో సిసలైన తెలంగాణవాదాన్ని, పోరాటపటిమను, నేర్పును అవమానిస్తారా? అసలైన తెలంగాణవాదం మీ అవినీతి పాలన చెరలో ఉంటే, మోసగాళ్లు, బంధిపోట్లు గద్దెనెక్కి రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారు. రూ.5లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచి, మీరు మాత్రం మీ జేబులు నింపుకుంటున్నారు. తెలంగాణకోసం పోరాడిన వారికి మాత్రం వెన్నుపోటు మీ కానుకా?’’ అని షర్మిల మండిపడ్డారు.

Advertisement

Next Story