AP Politics: బాలినేనికి నో ఎంట్రీ..ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తు

by Indraja |
AP Politics: బాలినేనికి నో ఎంట్రీ..ప్రశ్నార్థకంగా మారిన భవిష్యత్తు
X

దిశ ప్రతినిధి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కూటమి పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలలో ఏదో పార్టీలో చేరి విచారణలు, కేసులు, అరెస్టుల నుంచి రక్షణ పొందేందుకు ఆయన గత వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితానివ్వలేదని తెలిసింది.

ఆయనతో పాటు ఆయన తరపున వియ్యంకుడు ద్వారా భాస్కర్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఒంగోలులో మంత్రిగా వుండగా చేసిన దౌర్జన్యాలు, అరాచకాలతో పాటు వందల కోట్ల రూపాయల విలువచేసే భూకబ్జాలు, అక్రమాలు, మైనింగ్ వ్యవహారాలతో బాలినేని ప్రతిష్ట దిగజారింది. ఫలితంగా ఇటీవల ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం పొందారు. దీంతో పార్టీ మారేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

టీడీపీలో గంటాకే సీన్ లేదు..

తెలుగుదేశం పార్టీలో తనకు సన్నిహితులైన గంటా శ్రీనివాసరావు ద్వారా కొంత ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో గంటాకే పెద్దగా సీన్ లేకపోవడంతో అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. భీమునిపట్నం నుంచి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు మంత్రి కూడా కాలేదు. గంటా శ్రీనివాసరావు కూడా ప్రకాశం జిల్లా వాడే కావడం, బాలినేనితోనూ, వియ్యంకుడు భాస్కర రెడ్డితో ఎంతో కాలంగా పరిచయాలు వుండడంతో ఆయన ద్వారా రక్షణ పొందేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని తెలిసింది. దీనికి తోడు ఇటీవలే గంటా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం లేకుండా రుషికొండ పర్యటనకు వెళ్లి ఆగ్రహానికి గురయ్యారు.

పవన్‌తో మంతనాలు ..

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్‌ను సంప్రదించి ఆయన ద్వారా జనసేనకు వచ్చేందుకు బుధవారం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిసింది. సినీ సర్కిల్లో తనకున్న పరిచయాలతో పాటు తమిళనాడు రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ద్వారా పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మూడు నాలుగు నెలలు ఆగిన తర్వాత చూద్దామనే సమాధానం వచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది. రామ్మోహనరావు గతంలో జనసేన కోసం పనిచేయడంతో ఆయన ద్వారా ప్రయత్నాలు చేశారు.

బీజేపీలోనూ ఎదురు దెబ్బే..

ఉమ్మడి ప్రకాశం జిల్లాకే చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరి రక్షణ పొందేందుకు నాలుగు రోజుల క్రితం బాలినేని బృందం ప్రయత్నాలు చేసింది. నాలుగు రోజుల క్రితం పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కారంచేడులో పురంధరేశ్వరి ఉన్నప్పుడు బాలినేని బృందం ఆమెని కలిసి సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. 6 నెలల తర్వాత చూద్దామని సమాధానం రావడంతో నిరాశతో వెనుతిరిగారని తెలిసింది.

వందల కోట్ల ఆరోపణలు ..

వియ్యంకుడు కె.భాస్కర్ రెడ్డి ద్వారా ఒంగోలు సమీపంలో చేపట్టిన విల్లాల ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. దానికి తోడు బంధువులు, బినామీల పేర్లతో బల్లికురవలో 550 ఎకరాల గ్రానైట్ కొండలు బాలినేని చేజిక్కించుకున్నారు. దానిపై గొడవలు జరుగుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా అచ్చుతాపురంలో బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి వేసిన అక్రమ లేఔట్‌లో 20 ఎకరాలకు పైగా అటవీశాఖ పంచాయతీ రాజ్ నీటిపారుదల శాఖల భూములు కబ్జాకు గురయ్యాయి.

బాలినేని మంత్రిగా ఉండగా ఒంగోలులో అరాచకమే రాజ్యమేలింది. పెద్ద ఎత్తున గ్రావెల్ క్వారీయింగ్, గ్రానైట్ క్వారీల్లో డంప్‌లో స్వాధీనం వంటి సంఘటనలు జరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాలినేనిని పార్టీలోకి తీసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో దూరం దూరంగా ఉంటున్న బాలినేని భవిష్యత్తు ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రశ్నార్థకంగా మారింది.

పార్టీ మార్పుపై మంతనాలు..

బాలినేని ముఖ్య అనుచరులు అంతా గురువారం హైదరాబాద్‌లో సమావేశం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ మారకపోతే విచారణలు, కేసులు అరెస్టులు తప్పవనే భయంతో వీరంతా బాలినేనిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏదో పార్టీలో చేరి తమను చేర్చుకొని రక్షణ కల్పించాల్సిందిగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏ పార్టీలోకి వెళ్లాలన్న విషయంపై బాలినేని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

Advertisement

Next Story