‘పాత బీజేపీ మంచిగుండే.. ఇప్పుడు మంచిగలేదు’

by Aamani |
Vemala Prashant Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పాత బీజేపీ మంచిగుండే, ఇప్పుడు మంచిగలేదు. అద్వానీ, వాజ్ పాయ్ విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. వారు నమ్మిన సిద్ధంతం కోసం పనిచేశారు. వారంటే గౌరవం ఉన్నది అని రాష్ర్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండలో కొందరు యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, అర్వింద్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకోసం పనిచేయడానికే ప్రజాస్వామ్యం అందుకే రాజకీయ పార్టీలు ఉన్నాయి. చిల్లరమల్లర రాజకీయాల కోసం కాదు అన్నారు.

‘‘నేను హిందువునే. ఎంపీ అర్వింద్ హిందువే. నేను 31 గుడులు కట్టించిన.. నీవు ఒక్క గుడి అయిన కట్టించినవా.. అని ఎంపీ అర్వింద్‌ని ప్రశ్నించారు. జై శ్రీరాం అని హృదయంలోంచి రావాలి. ఊరికే మాట్లాడడం కాదు. నేను నీకంటే కట్టర్ హిందువును. అయినా అన్ని మతాల ప్రజలను నేను ప్రేమిస్తా. గౌరవిస్తా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. యువత బీజేపీ మాయలో పడొద్దని, ఫేక్ సోషల్ మీడియా నమ్మొద్దన్నారు. డబుల్ బెడ్రూం ఒక్క ఇంటికోసం రూ.5.80 లక్షలు ఖర్చు అవుతుంటే అందులో మోడీ ఇస్తా అన్నది రూ.72వేలు మాత్రమే అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు అసలే ఉండవని, రూ.2000 పెన్షన్ కోసం రాష్ట్రానికి సంవత్సరానికి రూ.8వేల కోట్లు ఖర్చు అయితే, కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లు మాత్రమే అని చెప్పారు. కేంద్రమే అన్ని ఇస్తున్నప్పడు తెలంగాణలో ఉన్నట్లు ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. దుబ్బాకలో ఇట్లనే చెప్పారని, ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా ఇలాగే చెబుతారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed