కొత్త బ్రాండింగ్‌తో వస్తున్న వొడాఫోన్ ఐడియా

by  |
కొత్త బ్రాండింగ్‌తో వస్తున్న వొడాఫోన్ ఐడియా
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగం (Telecom sector)లో తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) సరికొత్త బ్రాండింగ్‌తో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇతర కంపెనీలను నిలువరించి ఇదివరకు ఉన్న బ్రాండ్ ఆదరణను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోమవారం సరికొత్త ‘వీఐ’ పేరుతో వైర్‌లెస్ సేవల బ్రాండ్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన లోగోను కూడా ఆవిష్కరించింది.

డిజిటల్ సేవల (Digital Services) విభాగంలో దేశీయ దిగ్గజాలైన ఎయిర్‌టెల్, జియోలకు పోటీ ఇవ్వాలని వొడాఫోన్ ఐడియా భావిస్తున్నట్టు టెలికాం రంగ విశ్లేషకులు తెలిపారు. 2020లో మొత్తం ఏజీఆర్ బకాయిల్లో 10 శాతం చెల్లించాలని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పది వాయిదాలలో మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు ఆదేశించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన రావడం విశేషం. గతవారం ఏజీఆర్ బకాయిలపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం వొడాఫోన్ ఐడియా బోర్డు రూ. 25 వేల కోట్లను సమీకరించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.

వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల కింద మొత్తం రూ. 50,400 కోట్లను చెల్లించాల్సి ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వివిధ మార్గాల్లో ఈ నిధులను సమీకరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఐడియాతో విలీనం జరిగిన తర్వాత సేవలను ఒక్కతాటిపై తెచ్చిన రెండేళ్ల అనంతరం వొడాఫోన్ కొత్త వ్యూహాలను ప్రకటించింది.

‘భారత్‌లో అత్యంత ఎక్కువగా ఆదరణ పొందిన రెండు బ్రాండ్లు కొత్తగా ‘టుగెదర్ ఫర్ టుమారో’ నినాదంతో కొత్త బ్రాండ్‌ను తీసుకువస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. తమ కొత్త బ్రాండ్ ‘వీఐ’తో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకెళ్తున్న భారత్ పురోగతిని మరింత వేగవంతం చేసేందుకు భాగస్వాంగా ఉంటుందని, లక్షలాది మందిని డిజిటల్ విభాగంలో రావడానికి ఇది తోడ్పాటు అందిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూ, వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు.

అతిపెద్ద స్పెక్ట్రమ్…

వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణ, మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఈ కొత్త బ్రాండ్‌ను ప్రకటించింది. ఇటీవల నిధుల సమీకరణ కంపెనీకి సానుకూలంగా ఉండటంతో, దీన్ని మరింత వేగవంతం, ప్రయోజనకరంగా మార్చుకోవడానికే కొత్త బ్రాండ్ తీసుకువచ్చినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎయిర్‌టెల్, జియోకు డిజిటల్ సేవల విభాగంలో గట్టి పోటీని ఇవ్వాలని, అదేవిధంగా రానున్న కొద్దిరోజుల్లో టారిఫ్ పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదివరకే భారతీ ఎయిర్‌టెల్ టారిఫ్‌ (Tariff)లు తక్కువగా ఉన్నాయని చెప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపెనీలు త్వరలో టారిఫ్‌లను పెంచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం దేశీయంగా 1846 మెగాహెడ్జ్‌ల అతిపెద్ద స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. కస్టమర్ సేవల్లో భాగంగా 4జీ సేవలను అందిస్తోంది.

అయితే, రెండేళ్ల క్రితం ఇరు కంపెనీలు కలిశాక విడి విడిగానే బ్రాండ్లను నిర్వహిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా చందాదారులను పోగొట్టుకున్న క్రమంలో రెండు కంపెనీలకు కలిపి ఒకటే బ్రాండింగ్ ఉండేలా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త బ్రాండింగ్ ‘వీఐ’ ద్వారా రానున్న రోజుల్లో కొత్త వినియోగదారులను సంపాదించుకోగలమని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐడియాకున్న బ్రాండ్ నేమ్, పట్టణాలు-నగరాల్లో వొడాఫోన్‌కున్న పట్టుతో కొత్త ‘వీఐ’ని విస్తరిస్తామని కంపెనీ వెల్లడించింది. కాగా, రెండు సంవత్సరాల క్రితం విలీనం జరిగిన సమయంలో వొడాఫోన్ ఐడియా రెండింటికి సుమారు 41 కోట్ల వినియోగదారులున్నారు, ఆ తర్వాతి పరిణామాలతో, టెలికాం రంగంలో ఉత్పన్నమైన కొత్త సవాళ్లతో ఈ సంఖ్య 28 కోట్లకు పడిపోయింది.


Next Story

Most Viewed