ఎస్‌బీఐని అధిగమించిన బజాజ్ ఫైనాన్స్!

by  |
ఎస్‌బీఐని అధిగమించిన బజాజ్ ఫైనాన్స్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ మార్కెట్ మూలధనాన్ని దాటి ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో దిగ్గజ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ మూలధనం పెరిగింది. మంగళవారం మార్కెట్ ముగిసిన సమయానికి రెండు సంస్థల మార్కెట్ క్యాప్‌ను గమనిస్తే.. బజాజ్ ఫైనాన్స్ రూ.1.76 లక్షల కోట్లతో ఉండగా, ఎస్‌బీఐ రూ.1.71 లక్షల కోట్ల వద్ద ఉంది. దీంతో, ఇండియాలోని అత్యధిక మార్కెట్ మూలధనం కలిగిన టాప్-100 కంపెనీల జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 12వ స్థానానికి చేరగా, ఎస్‌బీఐ 13వ స్థానంతో సరిపెట్టుకుంది. బజాజ్ ఫైనాన్స్ సంస్థ 2016లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవగా లిస్టైన ఆర్థిక సంవత్సరంలోనే 40 శాతం పెరుగుదల నమోదుచేసింది. 2017లో 109 శాతం, 2018లో 51 శాతం, 2019లో 60 శాతంతో దూకుడుగా ర్యాలీ చేసింది. మొత్తంగా పరిశీలిస్తే 2016 నుంచి ఇప్పటివరకూ షేర్ విలువ ఏకంగా 712 శాతం లాభపడింది. అయితే, ప్రస్తుత ఏడాదిలో కరోనా వ్యాప్తి అనంతరం లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం మారటోరియం విధించడంతో నిరర్ధక ఆస్తులు పెరుగుతాయనే సంకేతాలతో 33 శాతం నష్టాలను నమోదు చేసింది. ఇక, మార్కెట్ మూలధనంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో వరుసగా టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ కంపెనీలు టాప్-10లో ఉన్నాయి.


Next Story

Most Viewed