కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. బరిలో ఉన్న ధనవంతులు వీళ్లే..!

by Dishanational6 |
కొనసాగుతున్న రెండో దశ పోలింగ్.. బరిలో ఉన్న ధనవంతులు వీళ్లే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలు , కర్ణాటకలోని 28 స్థానాలకు గాను 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 6 సీట్లు, అస్సాం, బీహార్‌లలో 5 సీట్లకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌లోని మూడు సీట్లు, మణిపూర్, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి పోలింగ్‌ జరుగుతోంది.

అయితే, 89 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా.. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ అభ్యర్థి మరణించారు. దీంతో మధ్యప్రదేశ్ లో ని బేతుల్ స్థానానికి మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఇకపోతే, 2019లో ఈ 89 స్థానాల్లో ఎన్డీఏ 56 స్థానాల్లో గెలవగా.. ప్రతిపక్ష యూపీఏ 24 స్థానాల్లో విజయం సాధించింది. రెండో దశ ఎన్నికల బరిలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ నాయకులు తేజస్వి సూర్య, హేమమాలిని, అరుణ్ గోవిల్, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశిథరూర్, జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి ఉన్నారు.

ధనిక అభ్యర్థులు వీరే..!

అభ్యర్థుల ఎలక్షన్ అఫిడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్‌ వాచ్‌ అనలైసిస్ చేసింది. 'స్టార్ చంద్రు'గా ప్రసిద్ధి చెందిన కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణ గౌడ రెండో దశ పోలింగ్‌లో అత్యంత ధనవంతుడు. హెచ్‌డీ కుమారస్వామిపై పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడకు రూ.622 కోట్ల ఆస్తులను ప్రకటించారు .

ఇక రూ. 593 కోట్లతో రెండవ అత్యంత సంపన్న అభ్యర్థిగా కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఉన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడే డీకే సురేష్. మథుర లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ హేమమాలిని ఆస్తులు రూ. 278 కోట్లుగా ప్రకటించిది. మూడో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత సంజయ్ శర్మ రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించి నాలుగో స్థానంలో ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మొత్తం ఆస్తులు రూ.217.21కోట్లతో ఐదో స్థానంలో నిలిచారు.

తక్కువ ఆస్తులున్న ఐదుగురు వీళ్లే..!

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావ్ పాటిల్ కేవలం రూ.500 విలువైన ఆస్తులు ప్రకటించారు. రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా ఆయన నిలిచారు. కేరళలోని కాసరగోడ్ నుండి పోటీ చేస్తున్న మరో స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కేఆర్ రూ.1,000 విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న పృథ్వీసామ్రాట్ ముకిందరావ్ దీప్వాన్ష్ రూ.1,400 ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న దళిత క్రాంతి దళ్ నాయకుడు షహనాజ్ బానో రూ. 2,000 ఆస్తులను ప్రకటించారు. కేరళలోని కొట్టాయం నుంచి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్ట్) తరపున పోటీ చేస్తున్న వీపీ కొచుమోన్ రూ.2,230 ఆస్తులతో జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.

జీరో అసెట్స్ ఉన్న అభ్యర్థులు వీళ్లే..!

రెండో దశలో బరిలో ఉన్న ఆరుగురికి జీరో అసెట్స్ ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ప్రకాష్ ఆర్ఏ జైన్, రాంమూర్తి ఎం, రాజారెడ్డికి సున్నా ఆస్తులు ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన కిషోర్ భీమ్‌రావ్ లబాడే, నగేష్ శంభాజీ గైక్వాడ్, జ్ఞానేశ్వర్ రావుసాహెబ్ కపటేకు జీరో అసెట్స్ ఉన్నాయి.

రెండో దశ పోలింగ్ తర్వాత కేరళ, రాజస్థాన్, త్రిపురలో పోలింగ్ ముగియనుంది. ఏప్రిల్ 19న జరిగిన తొలి దశ ఓటింగ్‌లో తమిళనాడు, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అండమాన్ దీవులు, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్ ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.



Next Story