బీజేపీలో అంత భయమెందుకు? రాహుల్ అమెరికా టూర్ సక్సెస్ పై అశోక్ గెహ్లోత్ కీలక వ్యాఖ్యలు

by Geesa Chandu |
బీజేపీలో అంత భయమెందుకు? రాహుల్ అమెరికా టూర్ సక్సెస్ పై అశోక్ గెహ్లోత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికా పర్యటన(America Tour) విజయవంతం కావడంతో.. బీజేపీ పార్టీ(BJP) లో భయం మొదలైందని, అందుకే అమెరికా పర్యటనపై పనిగట్టుకొని మరీ ఆయనపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోందని.. అయితే దేశ ప్రజలు మాత్రం రాహుల్ వెంటే ఉన్నారని అన్నారు.

ఈ సందర్భంగా అశోక్ గెహ్లోత్ మాట్లాడుతూ.. "కొందరు బీజేపీ నేతలు రాహుల్ గాంధీ పై బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆయనను అంతమొందిస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య బీజేపీ నేత తర్వీందర్ సింగ్, రాహుల్ గాంధీని బెదిరిస్తూ.. 'రాహుల్! నువ్వు ఇలాంటి పనులు మానుకో.. లేకపోతే మీ నానమ్మకు పట్టిన గతే రాబోయే కాలంలో నీకూ పడుతుంది' అంటూ తర్వీందర్ చేసిన వ్యాఖ్యలను గెహ్లోత్ గుర్తు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గెహ్లోత్ అన్నారు. కాగా ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని దీన్ని బట్టి అర్ధమవుతోందని అశోక్ గెహ్లోత్ తెలిపారు.

ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీ అమెరికా టూర్ గురించి గెహ్లోత్ మాట్లాడుతూ.. రాహుల్ 4 రోజుల అమెరికా పర్యటన పూర్తిగా విజయవంతం అయిందని, అందువల్లే ఇప్పుడు బీజేపీ లో భయం పుట్టుకుందని.. దీంతోనే ఈ పర్యటనకు సంబంధించి రాహుల్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లను తొలగించాలన్న అంశంపై ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఇంత జరిగినా బీజేపీకి మాత్రం బుద్ధి రాలేదని.. ఈ సందర్భంగా అశోక్ గెహ్లోత్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed