Karnataka CM : భార్యకు 14 ప్లాట్లు కేటాయించుకున్న కర్ణాటక సీఎం : కేంద్ర మంత్రి

by Hajipasha |
Karnataka CM : భార్యకు 14 ప్లాట్లు కేటాయించుకున్న కర్ణాటక సీఎం : కేంద్ర మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి చెందిన 14 విలువైన ప్లాట్లను భార్యకు కేటాయించుకున్న కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. 2013లో ఎన్నికల సంఘానికి సీఎం సిద్ధరామయ్య సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ప్లాట్ల వివరాలను ప్రస్తావించలేదన్నారు. ‘‘2018లో సమర్పించిన అఫిడవిట్‌లో ఈ ప్లాట్ల విలువ రూ.25 లక్షలుగా సిద్దరామయ్య పేర్కొన్నారు. 2023లో సమర్పించిన అఫిడవిట్‌లో వాటి విలువ రూ.25 కోట్లు అని ప్రస్తావించారు’’ అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌‌లోని నిజానిజాలు తెలియాలంటే సిద్ధరామయ్య గద్దె దిగి.. విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నిధులను కూడా దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ విభాగాలకు కేటాయించాల్సిన రూ.189 కోట్లలో కేవలం రూ. 89 కోట్లనే ఆయా శాఖలకు బదిలీ చేశారని కేంద్రమంత్రి తెలిపారు. వాల్మీకి బోర్డు కుంభకోణంలోనూ కర్ణాటక సీఎం ప్రమేయం ఉందన్నారు. ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై ఎఫ్ఐఆర్‌ను దాఖలు చేసే స్థాయికి సిద్ధరామయ్య సర్కారు దిగజారిందని ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.



Next Story