అమెరికా అక్రమ వలసదారులతో మరో రెండు విమానాలు..ఈసారి ఎంత మంది వస్తున్నారంటే?

by D.Reddy |
అమెరికా అక్రమ వలసదారులతో మరో రెండు విమానాలు..ఈసారి ఎంత మంది వస్తున్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అగ్రరాజ్యం అమెరికా (America) అక్రమ వలసదారులను జల్లెడపడుతుంది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండేవాళ్లు, అక్రమ మార్గాల్లో అక్కడకు చేరుకున్న వారిని తిరిగి స్వదేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు చెందిన ప్రజలను వారి దేశాలకు చేర్చిన అమెరికా.. ఇటీవలే 104 మంది భారతీయులను ఇండియాకు పంపింది. తాజాగా మరో రెండు విమానాల్లో అమెరికాలోని భారతీయ అక్రమ వలసదారులు రాబోతున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) తో భేటీ అయిన కొన్ని గంటల తర్వాత అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

అమెరికా నుంచి 119 మందితో ఇవాళ (ఫిబ్రవరి 15వ తేదీ) భారత్‌కు రాబోతుంది. సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌ 3 యూఎస్ (USA) మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో వీరిని తరలిస్తున్నారు. రాత్రి 10.05 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో ఈ విమానం ల్యాండ్ కాబోతుంది. 119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్‌ రాష్ట్రానికి చెందినవారు కాగా.. 33 మంది హర్యానా, 8 మంది గుజరాత్, ముగ్గురు ఉత్తరప్రదేశ్, ఇద్దరు చొప్పున గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒకరు చొప్పున హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ( ఫిబ్రవరి 16వ తేదీ) మరో విమానం ఇండియాకు చేరుకునే అవకాశం ఉంది.

ఇక, ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి సమయంలో రేపు మరో విమానం భారత్‌కు వస్తే అందులో ఉన్న వారు ఎలా ఉండబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ట్రంప్‌తో (Trump) భేటీలో సైతం ఈ అంశంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.

అక్రమవలసదారుల విమానం అమృత్‌సర్‌లోనే ల్యాండ్ అవుతుండడంపై పంజాబ్ రాష్ట్ర మంత్రి హర్పాల్ సింగ్ చీమా విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌కు చెడ్డపేరు తేవాలని చూస్తోందని మండిపడ్డారు. గుజరాత్, హర్యానా, ఢిల్లీలో విమానం ఎందుకు ల్యాండ్ కావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇటు పంజాబ్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 10 అక్రమ వలస ముఠాలపై కేసులు నమోదు చేసినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Next Story