Subramanian Swamy : రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ పిల్.. సుబ్రమణ్యన్ స్వామి సంచలనం

by Hajipasha |
Subramanian Swamy : రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ పిల్.. సుబ్రమణ్యన్ స్వామి సంచలనం
X

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో సంచలన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ తాను రాసిన లేఖపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం శాఖకు ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆయన కోరారు. ఈ అంశంపై తాను 2019లో కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని.. అయినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందనా రాలేదని న్యాయస్థానానికి సుబ్రమణ్యన్ స్వామి తెలిపారు. రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో తన తరఫు న్యాయవాది సత్య సభర్వాల్ పిల్ దాఖలు చేసిన విషయాన్ని సుబ్రమణ్యన్ స్వామి ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘‘విదేశీ పౌరసత్వం అంశంపై రాహుల్ గాంధీని కేంద్ర హోంశాఖ ఎందుకు విచారించలేదు ? కనీసం ఆయన నుంచి దీనిపై ఎందుకు వివరణ తీసుకోలేదు ? దీనిపై స్పందించేందుకు, కేంద్ర హోంశాఖకు సమాధానం ఇచ్చేందుకు రాహుల్ ఎందుకు సిద్ధంగా లేరు?’’ అని పేర్కొంటూ సుబ్రమణ్యన్ స్వామి ట్వీట్‌లో ప్రశ్నలు సంధించారు.

ఆ లేఖలో ఏముంది ?

2019లో కేంద్ర హోంశాఖకు బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి రాసిన లేఖ ప్రకారం.. 2003 సంవత్సరంలో యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)లో బ్యాక్ ఆప్స్ లిమిటెడ్ (Backops Limited) పేరుతో ఒక కంపెనీ రిజిస్టర్ అయి ఉంది. అందులో ఒక డైరెక్టర్‌ అండ్ సెక్రెటరీ హోదాలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారని 2019లో భారత హోంశాఖకు రాసిన లేఖలో సుబ్రమణ్యన్ స్వామి ఆరోపించారు. ఆ కంపెనీ వార్షిక రిటర్న్స్ 2005 సంవత్సరం అక్టోబరు 10, 2006 సంవత్సరం అక్టోబరు 31 తేదీల్లో ఫైల్ చేశారని.. అందులో రాహుల్ గాంధీని బ్రిటీష్ జాతీయుడిగా ప్రస్తావించారని లేఖలో సుబ్రమణ్యన్ స్వామి ప్రస్తావించారు. దీంతోపాటు ఆ కంపెనీ 2009 సంవత్సరం ఫిబ్రవరి 17న జారీ చేసిన ఒక డిజల్యూషన్ అప్లికేషన్‌లోనూ రాహుల్‌గాంధీని బ్రిటీష్ జాతీయుడిగా ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు. ఈవిధంగా రెండు దేశాల పౌరసత్వాలను ఏకకాలంలో కలిగి ఉండటం అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9తో పాటు ‘ఇండియన్ సిటిజెన్‌షిప్ యాక్ట్ - 1955’ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆ లేఖలో వివరించారు.

Next Story

Most Viewed