సందేశ్ ఖాలీ ఘటనలు బీజేపీ కుట్ర: టీఎంసీ తీవ్ర ఆరోపణలు

by Dishanational2 |
సందేశ్ ఖాలీ ఘటనలు బీజేపీ కుట్ర: టీఎంసీ తీవ్ర ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసులో భాగంగా బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర ఆరోపణలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రం పరువు తీసేందుకు బీజేపీ కుట్రలు చేసిందని వెల్లడించింది. బీజేపీ నేత సువేంధు అధికారి ఈ ఘటనలను సృష్టించాడని తెలిపింది. ఈ మేరకు శనివారం స్టింగ్ ఆపరేషన్ చేసిన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రకారం.. సందేశ్‌ఖాలీలోని బీజేపీ మండల అధ్యక్షుడిగా పరిగణించే వ్యక్తి మాట్లాడుతూ.. షాజహాన్‌తో సహా ముగ్గురు టీఎంసీ నాయకులపై అత్యాచార ఆరోపణలు చేయడానికి సువేంధు అధికారి ముగ్గురు నుంచి నలుగురు స్థానిక మహిళలను ప్రేరేపించాలని, తనను ఆ ప్రాంతంలోని ఇతర బీజేపీ నాయకులను ఆదేశించార ఆరోపించాడు. సందేశ్‌ఖాలీలోని ఒక ఇంటిలో స్వయంగా తుపాకీలను అమర్చినట్లు పేర్కొన్నాడు. ఆ తర్వాత దానిని కేంద్ర ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

దీనిపై టీఎంసీ స్పందిస్తూ.. సామూహిక లైంగిక దాడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం వరకు ప్రతి అంశాన్ని సువేంధు అధికారి దగ్గరుండి నడిపించారు. ఇటువంటివి ఆయన తప్ప మరెవరూ చేయలేరు. బెంగాల్‌ను అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ ఏ రాయినీ వదిలిపెట్టలేదు’ అని పేర్కొంది. మోడీ, అమిత్ షాల కుట్ర బయటపడింది అని తెలిపింది. అలాగే ‘సందేశ్ ఖాలీ స్టింగ్ ఆపరేషన్ బీజేపీలో తెగులు ఎంత లోతుగా ఉందో చూపిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు కించ పరిచే ప్రయత్నం చేశారు’ అని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

ఈ ఘటనల వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందన్న టీఎంసీ వైఖరిని ఈ వీడియో రుజువు చేసిందని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ తెలిపారు. బెంగాల్‌పై దుష్ప్రచారం చేసినందుకు బీజేపీ అగ్ర నాయకత్వం 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ మండిపడింది. అదంతా ఫేక్ వీడియో అని కొట్టి పారేసింది. ప్రజల దృష్టిని మరల్చడానికి టీఎంసీ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సందేశ్ ఖాలీ ఘటనపై ప్రజల ఆగ్రహాన్ని టీఎంసీ ఎదుర్కోలేకపోతుందని బీజేపీ అధికార ప్రతినిధి శంకుదేబ్ పాండా అన్నారు. బెంగాల్ మహిళలను టీఎంసీ అవమానిస్తోందని ఆరోపించారు.

Next Story

Most Viewed