Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే?

by vinod kumar |
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మార్పు.. కొత్త పేర్లు ఇవే?
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్‌ల పేర్లను ‘గణతంత్ర మండపం’, ‘అశోక్ మండపం’గా మార్చారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్రపతి భవన్ దేశానికి చిహ్నం, దేశ అమూల్యమైన వారసత్వం. వీటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. భారతీయ సాంస్కృతిక విలువలకు అనుగుణంగా రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని తీసుకురావడానికి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలో రెండు హాళ్ల పేరను మార్చాం’ అని పేర్కొంది. కాగా, దర్బార్ హాల్ జాతీయ అవార్డుల ప్రదానం వంటి ముఖ్యమైన వేడుకలకు వేదికగా ఉంటుంది. అయితే గతంలో సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని కూడా దర్బార్ అని పిలిచేవారు. భారతదేశం గణతంత్ర రాజ్యం అయిన తర్వాత దాని ఔచిత్యాన్ని కోల్పోయింది. ఈ కారణంతోనే పేరు మార్చినట్టు తెలుస్తోంది.

ఇక, అశోక అన్న పదానికి అన్ని బాధల నుంచి విముక్తి కలిగిన వ్యక్తి అని అర్థం. అంతేగాక అశోక చక్రవర్తిని కూడా సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక్ హాల్ పేరును అశోక్ మండపంగా మార్చడం భాషలో ఏకరూపతను తెస్తుంది అని రాష్ట్రపతి భవన్ తెలిపింది. అయితే ఈ పేర్లు మార్చిన నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. రాజు అనే భావన దేశంలో ఇప్పటికీ ఉందని తెలిపారు. దర్బార్ అనే కాన్సెప్ట్ లేదు కానీ షాహెన్‌షా అనే కాన్సెప్ట్ మాత్రమే ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed