Canada: ఇలా జరిగిందేంటీ?.. ఆందోళనలో పంజాబీ కుటుంబాలు

by Mahesh Kanagandla |   ( Updated:2024-10-15 13:40:28.0  )
Canada: ఇలా జరిగిందేంటీ?.. ఆందోళనలో పంజాబీ కుటుంబాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది యువత కెనడాకు వెళ్లుతుంటారు. మన దేశం నుంచి కెనడా వెళ్లేవారిల 70 శాతం వీరే ఉన్నారు. పంజాబ్‌లోని కపుర్తలా, జలంధర్, హోషియార్‌పూర్, షహీద్ భగత్ సింగ్ నగర్‌ల నుంచి చాలా మంది విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతున్నారు. ఇందులో ప్రధానంగా కెనడా ఉంటే ఆ తర్వాత యూఎస్ఏ, యూకే దేశాలుంటాయి. కొన్ని తరాలుగా ఈ వలసలు ఉండటంతో పంజాబీల జనాభా అక్కడ గణనీయంగా పెరిగింది. తద్వార తమ బంధువులను కలుసుకునే క్రమంలో పంజాబ్, కెనడాల మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. కానీ, ఇటీవల కాలంలో భారత్, కెనడాల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది. ఈ పరిణామం పంజాబ్ ప్రజలకు, కెనడాలో సెటిల్ అయిన పంజాబీలకు చిక్కులు తెచ్చింది.

ఉన్నత కుటుంబాలు కాకుండా దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి కూడా కెనడాకు వెళ్లి గొప్ప చదువులు చదువుతుంటారు. అక్కడే పార్ట్ టైం చేసుకుంటూ చదువులు కొనసాగిస్తుంటారు. అన్ని సక్రమంగా జరిగితే తమ బంధువులు, తర్వాతి తరాన్ని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు భారత్, కెనడాల మధ్య నెలకొన్న దౌత్య సంక్షోభంతో ఇదంతా తారుమారు అవుతున్నది. ఇప్పుడు ఉన్నత చదువులు, కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆశపడేవారి కలలు కల్లలవుతున్నాయి. అక్కడే సెటిలైన తమ బంధువులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నవారికి కూడా ఈ సంక్షోభం సంకటాన్ని తెచ్చిపెట్టింది.

దౌత్య సంక్షోభం.. సంకటం

కొన్ని నెలలుగా అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశ సంఖ్యను కెనడా కుదిస్తూ వస్తున్నది. అక్కడ పర్మినెంట్ రెసిడెన్సీ కోసం స్వీకరించే దరఖాస్తుల సంఖ్యను తగ్గిస్తున్నది. పార్ట్ టైం చేసుకునే అవకాశాలపైనా నీళ్లు చల్లుతున్నది. వారానికి 20 పనిగంటలు మాత్రమే అనుమతించడంతో దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వెళ్లిన విద్యార్థులు అక్కడ నిలదొక్కుకోవడం కష్టతరమవుతున్నది. విద్య, ఉన్నత జీవితం కోసం ఆశలు పెట్టుకున్న యువతకు కెనడా తీరు ఇబ్బందికరంగా మారింది. అలాగే.. ఇది వరకే అక్కడ సెటిలైన తమ వారిని కలుసుకునే వారికీ ప్రస్తుత దౌత్య సంక్షోభంతో వీసాలు పొందడం ఇబ్బందిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed