Explosives Market : ‘బాంబ్ బజార్’‌‌ తడాఖా.. 3 నెలల్లో రూ.900 కోట్ల వ్యాపారం

by Hajipasha |   ( Updated:2024-10-20 15:40:46.0  )
Explosives Market : ‘బాంబ్ బజార్’‌‌ తడాఖా.. 3 నెలల్లో రూ.900 కోట్ల వ్యాపారం
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని ‘నాగ్‌పూర్’‌ పేలుడు పదార్థాల తయారీ విషయంలో వరల్డ్ ఫేమస్. బాంబులు, రాకెట్లలో వాడే చాలా ముడి పదార్థాలను నాగ్‌పూర్ పరిధిలోని ఫ్యాక్టరీలలో నిత్యం పెద్దఎత్తున తయారు చేస్తుంటారు. ఈ కర్మాగారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో పనిచేస్తున్నవే. వీటిపై సర్కారు పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుంది. నాగ్‌పూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్స్ మార్కెట్‌ను ‘బాంబ్ బజార్’ అని పిలుస్తుంటారు. గత మూడు నెలల వ్యవధిలో ‘బాంబ్ బజార్’‌లో వ్యాపారం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. నాగ్‌పూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్స్ మార్కెట్ గడిచిన 90 రోజుల్లో రూ.900 కోట్లు విలువైన షెల్స్, రాకెట్లు, బాంబులు, హెచ్ఎంఎక్స్, ఆర్‌డీఎక్స్, టీఎన్‌టీలను పలు దేశాలకు అధికారికంగా విక్రయించడం విశేషం.

మరో రూ.3వేల కోట్లు విలువైన ఆర్డర్లు ప్రస్తుతం ప్రాసెసింగ్ దశలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లభించిన తర్వాత ఆయా ఆర్డర్లను కూడా నాగ్‌పూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్స్ ఫ్యాక్టరీలు డెలివరీ చేయనున్నాయి. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్, సిరియా, ఇరాక్ వంటి దేశాలు యుద్ధం ముంగిట్లో ఉన్నాయి. దీంతో ఈ దేశాలకు ఆయుధాల సప్లైను భారత్ తాత్కాలికంగా ఆపేసింది. బాంబులు, షెల్స్, రాకెట్ల కోసం గత మూడు నెలల్లో నాగ్‌పూర్‌లోని ఎక్స్‌ప్లోజివ్స్ మార్కెట్‌కు పెద్దఎత్తున ఆర్డర్స్ ఇచ్చిన దేశాల జాబితాలో సౌదీ అరేబియా, వియత్నాం, పోలాండ్, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, బల్గేరియా ఉండటం గమనార్హం.

Advertisement

Next Story