దేశంలో మొట్టమొదటి ‘‘వాటర్ మెట్రో’’.. జాతికి అంకితం చేసిన మోడీ

by Satheesh |
దేశంలో మొట్టమొదటి ‘‘వాటర్ మెట్రో’’.. జాతికి అంకితం చేసిన మోడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా వాటర్ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఈ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు వచ్చిన ప్రధాని మోడీ ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఆ రాష్ట్రంలో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.

డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే మెట్రో సర్వీస్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. కొచ్చి వాటర్ మెట్రో సర్వీస్ లో బ్యాటరీ సాయంతో నడిచే 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం 38 టెర్మినళ్లు నిర్మించారు.

కొచ్చి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగించనున్నాయి. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ వాటర్ మెట్రో దేశంలో, దక్షిణాసియాలోనే మొట్ట మొదటిది. కొచ్చి వాటర్ మెట్రో సర్వీస్‌లో టికెట్ ప్రారంభ ధర రు. 20 కాగా గరిష్టంగా రూ.40 ఉంటుందని అధికారులు తెలిపారు.

వీటికి నెలవారీ పాస్ సౌకర్యం కూడా కల్పించారు. ఇక కేరళ పర్యటన సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నది చెప్పారు. కేరళ అక్షరాస్యత, కృషి, సామర్థ్యం మరియు తెలివితేటలతో నిండిన నేల అని రాష్ట్రాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Next Story