‘చిదంబరానికి ఇచ్చిన రిలీఫ్‌నే కవితకు కూడా ఇవ్వాలి’

by GSrikanth |
‘చిదంబరానికి ఇచ్చిన రిలీఫ్‌నే కవితకు కూడా ఇవ్వాలి’
X

దిశ, వెబ్‌డెస్క్: కవితకు ఈడీ గతేడాది సమన్లు ఇచ్చినప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ‘‘కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున సమన్లు ఇవ్వబోమంటూ ఈడీ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు బెంచ్‌కు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా మరోసారి వాదనలు జరిగాయి. ఈడీ న్యాయవాదులే కేసు విచారణపై వాయిదాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో అదనపు సోలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని దేశమంతా చూసింది. ఆ మాటలను ఈడీ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించింది. ఈడీ ఇచ్చిన సమన్లను, నమోదు చేసిన కేసును నిలిపివేయాలని, మొత్తం కేసునే క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కోరాం.

ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నది. నిన్న కూడా కేసు మరోసారి విచారణకు వచ్చింది. నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి అయ్యి.. కేసు వాయిదా పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తెలంగాణలో కవిత నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సాయంత్రానికి అరెస్టు చేస్తున్నట్లు ఈడీ ఆఫీసర్లు ప్రకటించారు. గతంలో సీఆర్పీసీ 160 సెక్షన్ కింద సీబీఐ 8 గంటలు ఆమెను విచారించింది. ఈనెల 19న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ఉంది. అప్పటి వరకు ఈ కేసు విచారణ ఇక్కడ నిలుపుదల చేయాలి. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వండి. నళినీ చిదంబరానికి ఇచ్చిన రిలీఫ్‌నే కవితకు కూడా ఇవ్వాలి’ అని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

Advertisement

Next Story