Mumbai: ముంబైలోని ఓ ఆసుపత్రిలో మద్యం మత్తులో మహిళా డాక్టర్‌పై దాడి

by S Gopi |
Mumbai: ముంబైలోని ఓ ఆసుపత్రిలో మద్యం మత్తులో మహిళా డాక్టర్‌పై దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని సియోన్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై ఓ వ్యక్తి తాగిన మత్తులో దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సియోన్ హాస్పిటల్‌లో మహిళా రెసిడెంట్ డాక్టర్‌పై సదరు వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం సమయంలో ముఖంపై గాయాలతో ఒక వ్యక్తి, అతని కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చారు. మహిళా డాక్టర్ అతనికి చికిత్స అందిస్తున్న సమయంలో నొప్పితో కేకలు వేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీని గురించి సియోన్-మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఎంఏఆర్‌డీ) జనరల్ సెక్రటరీ డాక్టర్ అక్షయా మోర్ మాట్లాడుతూ.. తాగిన వ్యక్తి 7-8 మంది బంధువులతో మత్తులో క్యాజువాలిటీకి వచ్చాడు. అతను అంతకుముందు ఎవరితోనో గొడవపడ్డాడని చెప్పారు. చికిత్స కోసం డాక్టర్ అతని బట్టలు తీస్తుండగా అతను దుర్భాషలాడుతూ దూషించాడు. అతని వెంట ఉన్న బంధువులు సైతం విషయం తెలియకుండా భౌతిక దాడికి దిగారని వివరించారు. సెక్యూరిటీని పిలిచే సమయానికి వారంతా పారిపోయారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. వాటిపై ఫిర్యాదులు కూడా నమోదవడంలేదు. అయితే, కోల్‌కతాలో జరిగిన ఘటన తర్వాత ఇటువంటి ఘటనలపై అప్రమత్తంగా ఉంటున్నామని డాక్టర్ అక్షయా చెప్పారు. దీనికి సంబంధించి మహిళా డాక్టర్ వాంగ్మూలంగా ఆధారంగా సియోన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed