NEET : కర్ణాటకలో ‘నీట్’ రద్దు.. బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం

by Hajipasha |
NEET : కర్ణాటకలో ‘నీట్’ రద్దు.. బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రద్దు చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నీట్ స్థానంలో రాష్ట్రంలో మరో ప్రవేశ పరీక్షను నిర్వహించడం కానీ, మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ)తో ముడిపెట్టడం కానీ చేయాలని ఈ బిల్లులో ప్రపోజ్ చేశారు. నీట్ పరీక్షను అమల్లోకి తేవడానికి ముందు వరకు రాష్ట్రాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించేవి.

మళ్లీ ఆ పద్ధతినే కర్ణాటకలో అమలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరే ప్రతిపాదన కూడా బిల్లులో ఉంది. ఈ బిల్లును ఆమోదం కోసం త్వరలోనే కర్ణాటక విధాన సౌధలో జరిగే అసెంబ్లీ సెషన్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నీట్-యూజీ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకుల జరిగాయంటూ దుమారం రేగుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపును కోరుతూ ఓ బిల్లును ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. దాన్ని ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపింది.



Next Story