ఐఐటీ-మద్రాస్ నుంచి పీహెచ్‌డీ అందుకున్న ఇస్రో చీఫ్

by S Gopi |
ఐఐటీ-మద్రాస్ నుంచి పీహెచ్‌డీ అందుకున్న ఇస్రో చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది ఆగష్టులో చారిత్రాత్మక చంద్రయాన్-3 మిషన్‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపినప్పుడు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఎంతో అమితంగా ఉప్పొంగిపోయారు. అలాగే, తాజాగా ఆయనకు ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్న సందర్భంగా కూడా అంతే ఆనందాన్ని పొందుతున్నట్టు చెప్పారు. శుక్రవారం ఐఐటీ మద్రాస్ 61వ కాన్వకేషన్‌లో యూనివర్సిటీ అధికారుల నుంచి డాక్టరేట్‌ అందుకున్న ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు. 'తనది గ్రామీణ నేపథ్యం. క్లాస్‌లో టాపర్‌గా ఉండేవాడిని. అయినప్పటికీ ఐఐటీ ఎంట్రన్స్ రాసే ధైర్యం అప్పుడు చేయలేదు. కానీ ఎప్పటికైనా ఐఐటీ నుంచి పట్టా తీసుకోవాలనే కోరిక మాత్రం గట్టిగా ఉండేది. మాస్టర్స్ డిగ్రీని బెంగళూరు ఐఐఎస్ నుంచి, ఇప్పుడు ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్‌డీ తీసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని' సోమనాథ్ ప్రసంగించారు. ఇక నుంచి తాను డా సోమనాథ్‌నని ఆయన అన్నారు. కాగా, ఇస్రో చీఫ్ డా సోమనాథ్‌కు ఇప్పటికే దాదాపు డజను గౌరవ పీహెచ్‌డీలు ఉన్నాయి. అయితే, పరిశోధనా పీహెచ్‌డీ సంపాదించడం ఎప్పటికీ భిన్నమైన అనుభూతినే ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 'పీహెచ్‌డీ అనేది ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా ఐఐటీ మద్రాస్ నుంచి తీసుకోవడం మరింత గౌరవాన్ని ఇస్తుంది. నాది సుధీర్ఘమైన ప్రయాణం. దశాబ్దాల క్రితం నేను ఇస్రో ప్రాజెక్టులో ఇంజనీర్‌గా ప్రారంభించిన వైబ్రేషన్ ఐసోలేటర్‌లకు సంబంధించిన అంశంపైనే నేను పనిచేశానని ఆయన జాతీయ మీడియాతో తన అనుభవం పంచుకున్నారు.



Next Story