Cabinet Committee: 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

by S Gopi |
Cabinet Committee: 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర కెబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో భారత్‌లో 12 స్మార్ట్‌సిటీల ఏర్పాటుకు ఆమొదం తెలిపారు. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎన్ఐసీడీపీ) కింద వీటిని ఏర్పాటు చేయనుండగా, ఇందుకు రూ. 28,602 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. ఈ స్మార్ట్ సిటీస్‌లో తెలంగాణకు 1, ఆంధ్రప్రదేశ్‌కు 2 కేటాయించారు. అవి కడప జిల్లా కొప్పర్తిలో 2596 ఎకరాల్లో(రూ. 2,137 కోట్ల వ్యయం), కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో(రూ. 2,786 కోట్లు) ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణలోని జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పారిశ్రామిక దృక్పథాన్ని మార్చడమే కాకుండా పారిశ్రామిక నోడ్‌లు, నగరాల మధ్య బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం, తద్వారా ఆర్థిక వృద్ధి, పోటీ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ స్మార్ట్‌స్టీటీల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయా, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలిలో ఈ పారిశ్రామిక ప్రాంతాలు నెలకొల్పనున్నారు. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్‌ఫీల్డ్ సిటీలుగా అభివృద్ధి కానున్నాయి. 'వాక్-టూ-వర్క్, ప్లగ్-అండ్-ప్లే విధానంలో సమర్థవంతమైన పారిశ్రామిక కార్యకలాపాలకు అనుగుణంగా అధునాతన మౌలిక సదుపాయాలను కలిగి ఉండేలా నిర్మించనున్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానించబడిన ఈ ప్రాజెక్ట్‌లు వివిధ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి.

Advertisement

Next Story