చైనా టార్గెట్.. మయన్మార్‌లోని కోకో ద్వీపంలో డ్రాగన్ మిలిటరీ బేస్..!

by Vinod kumar |
చైనా టార్గెట్.. మయన్మార్‌లోని కోకో ద్వీపంలో డ్రాగన్ మిలిటరీ బేస్..!
X

న్యూఢిల్లీ : మయన్మార్‌ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది. బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్‌కు మయన్మార్‌ ఆర్మీ పర్మిషన్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వాటిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే కోకో ద్వీపం నుంచి భారత్ లోని చెన్నై, వైజాగ్, కోల్ కతా, బాలాసోర్ తీర ప్రాంతాలను చైనా ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది. చైనా లోన్ ట్రాప్ చాలా డేంజరస్ గా ఉంటుంది. మయన్మార్ కూడా ఇందులో ఇరుక్కుంది. 2021లో మయన్మార్ లో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆంగ్ సాన్ సూకీని జైలులో వేసింది. సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఆధ్వర్యంలో మయన్మార్‌ లో సైనిక పాలన మొదలైంది. దీన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకించాయి.

అయితే ఈ అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకుంది. మయన్మార్‌కు గత 2 ఏళ్లలో దాదాపు రూ.32వేల కోట్ల లోన్ ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ బెల్ట్ రోడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలనే షరతు పెట్టింది. భారత్ లోని కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ తీర ప్రాంతాలకు చేరువగా ఉండే బంగాళాఖాతంలోని కోకో ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసే ఛాన్స్ ఇవ్వమని మయన్మార్‌ సైనిక పాలకులను చైనా కోరింది. ఇప్పటికే కోకో ద్వీపంలో విమాన సౌకర్యం కోసం చైనా రన్‌వే నిర్మించిందని ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోందని మీడియా రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ద్వీపంలో దాదాపు 1500 మంది చైనా సైనిక సిబ్బంది కోసం కొత్త షెడ్‌లు, బ్యారక్‌లు నిర్మించారని సమాచారం.

భారత్ ఆందోళనకు కారణాలు ఇవీ..

మయన్మార్ లోని కోకో ద్వీపంలో చైనా ఆర్మీ బేస్ ఏర్పాటుపై భారత్ ఆందోళన చెందుతోంది. ఇందుకు కారణాలు ఏమిటంటే.. ఒడిశాలోని బాలాసోర్‌లో న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ ఫైరింగ్ రేంజ్, సాంప్రదాయిక క్షిపణి పరీక్షా ఫైరింగ్ రేంజ్ ఉన్నాయి. ఇది కోకో ద్వీపం ఉన్న అక్షాంశంలోనే ఉంది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం కూడా.. సూటిగా కోకో ద్వీపం ఉన్న అక్షాంశంలోనే ఉంది. దీంతో కోకో ద్వీపం నుంచి ఆ ప్రాంతంపై కూడా చైనా ఇంటెలీజెన్స్ కొనసాగొచ్చు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న వ్యూహాత్మక సైనిక ఆస్తులపై కోకో ద్వీపం నుంచి చైనా నిఘా పెట్టగలదు.

అక్కడి నుంచి భారతదేశం యొక్క అణు జలాంతర్గాముల కదలికను చైనా పర్యవేక్షించే ఛాన్స్ ఉంది. భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు కూడా విశాఖపట్నం తీరంలో ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో భారత సైన్యం కదలికలపై అదనపు ఇన్ పుట్స్ పొందేందుకు కోకో ద్వీపాన్ని ఒక వేదికగా చైనా వాడుకోనుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed