Illicit liquor: కల్తీ మద్యం తాగి 8 మంది మృతి.. బిహార్‌లో విషాదం

by vinod kumar |   ( Updated:2024-10-16 14:42:09.0  )
Illicit liquor: కల్తీ మద్యం తాగి 8 మంది మృతి.. బిహార్‌లో విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో మరోసారి కల్తీ మద్యం పంజా విసిరింది. రాష్ట్రంలోని సరన్, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. సివాన్‌లో ఆరుగురు మరణించగా, సరన్ జిల్లాలో ఇద్దరు మరణించినట్టు అధికారులు తెలిపారు. మరో 12 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సరన్ జిల్లాలో మష్రాఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ముగ్గురు సోదరులు మద్యం తాగగా అందులో ఇద్దరు మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి సైతం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇక, సివాన్ జిల్లాలోని మఘర్, ఔరియా గ్రామాల్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందారు. మద్యం తాగిన వ్యక్తులు కళ్లు సరిగా కనిపించకపోవడం, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. కాగా, 2022లో సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మరణించారు.

Advertisement

Next Story