నేను గాంధీ ఫ్యామిలీకి సేవకుడిని కాదు: అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ

by Dishanational2 |
నేను గాంధీ ఫ్యామిలీకి సేవకుడిని కాదు: అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన కిశోరీ లాల్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీపై ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అగ్రనేత తన ప్యూన్‌ను పోటీలో ఉంచారని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను గాంధీ కుటుంబానికి సేవకుడిని కాదని స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త అని తెలిపారు. బీజేపీ నేత స్మృతి ఇరానీని ఓడిస్తానని దీమా వ్యక్తం చేశారు. అమేథీ నుంచి తనను పోటీకి దింపాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. వృత్తిరీత్యా గాంధీ కుటుంబానికి తాను సేవ చేయలేదన్నారు.

యూత్ కాంగ్రెస్‌తో తనకున్న అనుబంధం కారణంగానే తాను 1983లో పంజాబ్ నుంచి అమేథీకి వచ్చానని తెలిపారు. 2014లో ఇచ్చిన హామీలను ప్రధాని మోడీ నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ దర్యాప్తు సంస్థలన్నింటికీ వాడుకుంటుందని విమర్శించారు. అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కాగా, కేఎల్ శర్మ గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా భావిస్తారు. అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల బాధ్యతలను ఆయనే నిర్వహించే వారని తెలుస్తోంది.

Next Story

Most Viewed