Gaganyaan : మిషన్ ‘గగన్‌యాన్’పై ఇస్రో కీలక ప్రకటన

by M.Rajitha |   ( Updated:2024-10-28 10:24:46.0  )
Gaganyaan : మిషన్ ‘గగన్‌యాన్’పై ఇస్రో కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Isro) చైర్మన్‌ సోమనాథ్‌ మిషన్ ‘గగన్‌యాన్’(Gaganyaan)పై కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’కు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా.. ఈ మిషన్‌ను 2026లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆల్‌ ఇండియా రేడియోలో సర్దార్‌ పటేల్‌ మెమోరియల్‌ లెక్చర్‌ సందర్భంగా సోమనాథ్‌ ఈ వివరాలను వెల్లడించారు.

చంద్రయాన్‌-3, మిషన్‌ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో ఆదేబాటలో తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్‌యాన్‌ యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి, సురక్షితంగా వారిని భూమిపైకి తేవడమే ఈ మిషన్‌ లక్ష్యం. వాస్తవానికి 2022లోనే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. కరోనా వలన ఆలస్యమైంది. ఈ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్‌ యూనియన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనున్నది.

మరోవైపు రానున్న సంవత్సరాల్లో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను కూడా సోమనాథ్ వెల్లడించారు. శాంపిల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్-4.. 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక భారత్-అమెరికా సంయుక్తంగా చేపట్ట దలచిన నిసార్ (NISAR) మిషన్‌ను వచ్చే ఏడాది అంటే 2025 లోనే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జగ్జాతో చంద్రయాన్-5 మిషన్ ప్రయోగం చేపట్టనున్నామని, ఇది మూన్-ల్యాండింగ్ మిషన్ అని వివరించారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్న విషయాన్ని మాత్రం సోమనాథ్ వెల్లడించలేదు.

Advertisement

Next Story

Most Viewed