Corruption Case: ఢిల్లీలో ఈడీ అధికారి ఆత్మహత్య..!

by Shamantha N |
Corruption Case: ఢిల్లీలో ఈడీ అధికారి ఆత్మహత్య..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అవినీతి ఆరోపణల కేసులో ఈడీ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఢిల్లీ సమీపంలోని సాహిబాబాద్‌లోని రైల్వే ట్రాక్‌పై ఈడీ అధికారి అలోక్ కుమార్ పంకజ్ మృతదేహం లభ్యమైంది. ఘజియాబాద్‌కు చెందిన అలోక్ కుమార్ డిప్యూటేషన్ పై ఢిల్లీలో ఉన్నారు. అంతకుముందు ఆయన ఆదాయపు పన్ను శాఖలో పనిచేశారు. ఇటీవల, అవినీతి ఆరోపణలపై సీబీఐ ఆయనను రెండుసార్లు ప్రశ్నించినప్పటికీ సాక్ష్యాధారాలు లేకపోవడంతో వదిలిపెట్టారు. ఈడీ అధికారి పంకజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తుని ప్రారంభించారు.

అవినీతి కేసులో నిందితుడిగా..

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సందీప్ సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత లంచం కేసులో అలోక్ కుమార్ పంకజ్ పేరు తెరపైకి వచ్చింది. తన కుమారుడిని అరెస్టు చేయనందుకు సింగ్ రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడని ఓ వ్యక్తి నుంచి సీబీఐకి ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఏజెన్సీ ఉచ్చు బిగించింది. ఢిల్లీలో రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సందీప్ సింగ్ పట్టుబడ్డాడు. గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసిన ముంబై నగల వ్యాపారి నుంచి కూడా సందీప్ సింగ్ లంచం తీసుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సందీప్ సింగ్‌తో పాటు అలోక్ కుమార్ పంకజ్‌ను నిందితుడిగా చేర్చారు. సందీప్ సింగ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed