ఆ మూడు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యత: నిర్మలా సీతారామన్

by S Gopi |
ఆ మూడు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీఏ ప్రాధాన్యత: నిర్మలా సీతారామన్
X

దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు రాష్ట్రాలను అభివృద్ధి చేసే అంశంపై ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా లాంటి తూర్పు రాష్ట్రాలను వృద్ధికి కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఈ మూడు రాష్ట్రాలు దేశానికి వృద్ధి ఇంజిన్‌లుగా మారాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. 2005కు ముందు ఆటవిక పాలన కారణంగా బీహార్ వృద్ధి బాగా దెబ్బతిన్నది. 1991లో బీహార్ తలసరి ఆదాయం రూ. 21,282 ఉండేది, జంగిల్ రాజ్ హయాంలో అది 33 శాతం తగ్గి రూ. 14,209కి పడిపోయింది. 2018 నాటికి బీహార్ తలసరి ఆదాయం ఏడాదికి 5 శాతం వృద్ధితో రూ. 37 వేలకు చేరింది. జంగిల్ రాజ్ సమయంలో పాలన మెరుగ్గా కొనసాగి ఉంటే 2019 నాటికి బీహార్ తలసరి ఆదాయం రూ. 95,330కి చేరేదని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీఏ భావిస్తోందని కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంపై వారు మాట్లాడటం మానేయాలి. సొంత పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో కాంగ్రెస్ నేతలు విఫలమైనప్పుడు ఇలాంటి వాటి గురించి ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు.



Next Story