ఢిల్లీ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో 5 ఆక్సిజన్ సిలిండర్లు పేలాయి: ఎఫ్ఐఆర్‌లో పోలీసులు

by S Gopi |
ఢిల్లీ ఆసుపత్రి అగ్నిప్రమాద ఘటనలో 5 ఆక్సిజన్ సిలిండర్లు పేలాయి: ఎఫ్ఐఆర్‌లో పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని ఓ చిల్డ్రన్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుఝామున నవజాత శిశువులను బలిగొన్న అగ్ని ప్రమాద సమయంలో అక్కడ 27 సిలిండర్లు ఉన్నాయని, వాటిలో ఐదు సిలిండర్లు పేలాయని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వివేక్ విహార్‌లోని బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్‌లో ఒక రోజు నుంచి 25 రోజుల వయసున్న చిన్నారులు అక్కడ చికిత్స పొందుతున్నారు. వారిలో చాలామంది మొదటి సంతానమని, కొందరు తమ తల్లిదండ్రులకు ఇదివరకు పిల్లలను కోల్పోయిన తర్వాత జన్మించినవారు కావడం విషాదం. హాస్పిటల్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది. మంటలు వ్యాపించడంతో రిసెప్షన్‌కు దగ్గరలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లకు మంటలు వ్యాపించాయని సందేహం వ్యక్తం చేసింది. 'మొదట ఒక ఆసుపత్రిలో మంటలు చెలరేగాయని, చాలామంది లోపలే చిక్కుకున్నట్టు కాల్ వచ్చింది. అక్కడకు చేరుకున్న వెంటనే మొత్తం 12 మంది శిశువులను తూర్పు ఢిల్లీలోని అడ్వాన్స్ ఎన్ఐసీయూ ఆసుపత్రికి తరలించినట్టు' ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) బృందాల ప్రకారం, సంఘటనా స్థలంలో వ్యాన్‌తో పాటు గోడలు, వైర్ ముక్కలు కాలిపోయిన దశలో కనిపించాయి. భవనంలో ఇంకా మంటల వేడి ఉండటంతో ఆధారలను సేకరించడం కష్టంగా మారింది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు దగ్గరలోని భవనాలు కూడా కాలిపోయిన స్థితిలో ఉన్నాయని ఎఫ్ఎస్ఎల్ నిపుణులు వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్‌లో అర్హత ఉన్న వైద్యుడు కూడా లేడు. ఆసుపత్రిలో ఐదుగురు రోగులను మాత్రమే చేర్చుకునే అనుమతులున్నాయని, కానీ మంటలు చెలరేగినప్పుడు 12 మంది నవజాత శిశువులు అక్కడ ఉన్నారని, ఇద్దరు నర్సులు, ఒక సాధారణ వైద్యుడు మాత్రమే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

యజమానితో పాటు డాక్టర్‌కు 3 రోజుల కస్టడీ..

ఇక, ఈ ఘటనకు సంబంధించి ఆన్-డ్యూటీ డాక్టర్‌ను మూడు రోజుల కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరుతూ ఢిల్లీ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఆసుపత్రి యజమాని డా నవీన్ ఖిచిని, విధుల్లో ఉన్న డాక్టర్ ఆక్ష్‌ను మూడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ విధి గుప్తా ఆనంద్ ఆదేశాలిచ్చారు.



Next Story