Maharashtra Elections: అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి..!

by Shamantha N |
Maharashtra Elections: అసెంబ్లీ ఎన్నికల బరిలో మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి పోటీ చేయనున్నారు. అహ్మద్ నగర్ సౌత్ నుంచి దిలీప్ ఖేడ్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్లలో ఆయన విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అహ్మద్‌నగర్ స్థానానికి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్‌పై ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో దిలీప్ ఖేడ్కర్.. మనోరమను తన భార్యగా పేర్కొన్నారు. ఆ అఫిడవిట్‌లో ఆయన తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో మాత్రం తాను భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. ఇకపోతే.. దిలీప్, మనోరమ ఖేడ్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమ ఖేడ్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.

పూజా ఖేడ్కర్ వివాదం

కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు 2022లో యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేడ్కర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేడ్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది.

Advertisement

Next Story

Most Viewed