BSF: సరిహద్దులో 4 చైనీస్ పిస్టల్స్, పాక్‌లో తయారైన 50 బుల్లెట్లు స్వాధీనం

by Harish |   ( Updated:2024-07-18 10:30:39.0  )
BSF: సరిహద్దులో 4 చైనీస్ పిస్టల్స్, పాక్‌లో తయారైన 50 బుల్లెట్లు స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: గురువారం ఉదయం పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు చైనా పిస్టల్స్, పాకిస్తాన్‌లో తయారు చేసిన 50 రౌండ్ల బుల్లెట్లను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో టార్న్ తరన్ జిల్లాలోని కల్సియన్ గ్రామంలో బహిరంగ మైదాన ప్రాంతంలో ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సరిహద్దు దళ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు పిస్టల్స్, వాటి ఖాళీ మ్యాగజైన్లు, 9x19 క్యాలిబర్ 50 రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది మెటల్ పిన్‌లను ఒక పసుపు రంగు ప్యాకెట్‌లో కనుగొన్నట్లు ప్రతినిధి పేర్కొన్నారు.

డ్రోన్ ద్వారా వీటిని భారత్‌లోకి పంపించారని, ఆయుధాలను ప్యాకెట్‌లో జాగ్రత్తగా ఉంచి దానిపై కర్రలను అమర్చి ఈ మైదాన ప్రాంతంలో జార విడిచినట్లు సరిహద్దు భద్రతా దళం అనుమానిస్తుంది. బుల్లెట్లలో 'పీఓఎఫ్' (పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు) అని గుర్తు కూడా ఉందని సిబ్బంది తెలిపారు. భారత భూభాగంలో ఉంటూ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్న తీవ్రవాదులకు సహాయంగా డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఆయుధాలను అందిస్తున్నదని బీఎస్‌ఎఫ్ పేర్కొంది.

ఇటీవల కాలంలో పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల ద్వారా ఆయుధాలు భారత భూభాగంలోకి ఎక్కువగా వస్తున్నాయి, ఈ మధ్య ఫజిల్కా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మూడు పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డ్రగ్స్‌ను కూడా డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తుండగా, చాలా సార్లు బీఎస్‌ఎఫ్ సిబ్బంది వాటిని పట్టుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed