BIG News: లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

by Shiva |   ( Updated:2024-08-09 07:05:07.0  )
BIG News: లిక్కర్ స్కాం కేసులో సంచలనం.. మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌ ద్విసభ్య ధర్మాసనం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో రూ.10 లక్షల బెయిల్ బాండ్‌ సమర్పించాలని, దేశం విడిచి ఎక్కడి వెళ్లొద్దని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. వారానికి రెండు సార్లు సోమ, గురువారాల్లో రిపోర్టు చేయాలని సిసోడియాను కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించకూడదని తెలిపింది.

విచారణలో పురోగతి లేకపోతే.. ఏ నిందితుడిని కాల పరిమితి లేకుండా జైలులో ఉంచలేరని తెలిపింది. ఒకవేళ జైలులోనే ఉంచాలనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్‌కు అప్లికేషన్ పెట్టడం, బెయిల్ పొందడం వారి హక్కు అని పేర్కొంది. ట్రయల్ వేగంగా జరిగేందుకు సిసోడియాకు సహకరించాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ సచివాలయం లేదా సీఎం కార్యాలయాన్ని సందర్శించకుండా సిసోడియాను నియంత్రించాలన్న ఈడీ అధికారుల అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరి 26న ఈడీ అరెస్ట్ చేయగా.. గత 17 నెలలుగా మనీష్ సిసోడియా జైలు జీవితం గడిపారు. తాజాగా, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Next Story