J&K encounter: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి

by Harish |
J&K encounter: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఒక సైనికుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌‌లో మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా, మేజర్ ర్యాంక్ అధికారితో సహా మరో ఐదుగురు గాయపడ్డారు. అలాగే, పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి తెల్లవారుజామున 2:30 గంటలకు కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ సమీపంలో దాడి జరిగింది. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న వారిని ప్రశ్నించగా, వెంటనే వారు కాల్పులు జరుపుతూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, భారత భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT), వీరితో పాటు తెహ్రికుల్ ముజాహిదీన్, లష్కర్, జైష్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని తెలుస్తుంది.

కాల్పుల్లో గాయపడ్డ భారత సైనికులను ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు జులై 24 న, కుప్వారాలోని లోలాబ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో రాత్రిపూట జరిగిన కాల్పుల్లో భద్రతా దళాలు గుర్తు తెలియని ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ కాల్పుల్లో ఓ జవాను కూడా చనిపోయాడు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, జమ్మూకశ్మీర్‌లోని కొండ జిల్లాల ఎగువ ప్రాంతాలలో సుమారు 40 నుండి 50 మంది పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం దాక్కున్నట్టు సమాచారం. వీరిని మట్టుబెట్టడానికి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.



Next Story