Bangladesh Protests : జైలుకు నిప్పుపెట్టిన నిరసనకారులు.. వందలాది ఖైదీలు పరార్

by Hajipasha |
Bangladesh Protests : జైలుకు నిప్పుపెట్టిన నిరసనకారులు.. వందలాది ఖైదీలు పరార్
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. అక్కడి భారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. అక్కడి పరిస్థితిని స్వయంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిశితంగా పరిశీలిస్తున్నారని.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించింది. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈవివరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. బంగ్లాదేశ్‌లో దాదాపు 8,500 మంది విద్యార్థులు, మొత్తం 15,000 మంది భారతీయులు ఉన్నారని చెప్పారు. వారంతా బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌తో టచ్‌లో ఉండాలని కోరారు. మూడింట ఒక వంతు సివిల్ సర్వీస్ ఉద్యోగాలను స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు చెందిన వారికి రిజర్వ్ చేసే ఆదేశాలను తిరిగి అమల్లోకి తేవాలని జులై 1న ఓ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి.

నార్సింగ్డి జిల్లా జైలుకు నిప్పు పెట్టడంతో..

సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని నార్సింగ్డి జిల్లా జైలుకు శుక్రవారం నిరసనకారులు నిప్పు పెట్టారు. అంతకంటే ముందు ఆ జైలు తలుపులన్నీ నిరసనకారులు తెరవడంతో వందలాది మంది ఖైదీలు పరారయ్యారు. మరోవైపు దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలను నిషేధించారు. ఇంటర్నెట్ షట్‌డౌన్ కూడా అమల్లో ఉంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా, మైమెన్‌సింగ్, ఖుల్నా, ఛటోగ్రామ్‌లలో నిరసనకారులు రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed