మహిళలకు 50శాతం రిజర్వేషన్..రైతు సంక్షేమానికి కృషి: ఎన్సీపీ(ఎస్పీ) మేనిఫెస్టో రిలీజ్

by Dishanational2 |
మహిళలకు 50శాతం రిజర్వేషన్..రైతు సంక్షేమానికి కృషి: ఎన్సీపీ(ఎస్పీ) మేనిఫెస్టో రిలీజ్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలకు గాను మహారాష్ట్రలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ చంద్ర పవార్) తన ఎన్నికల మేనిఫెస్టోను గురువారం రిలీజ్ చేసింది. శపత్నామా పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే రైతుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తామని తెలిపింది. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర స్థాయి హోదాకు మద్దతిస్తామని పేర్కొంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతేగాక పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ), చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) వంటి చట్టాలను సమీక్షించి వాటిలో మార్పులు తీసుకొస్తామని వెల్లడించింది.

రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలకు అధికారం కల్పించడం, విద్యుత్ పంపిణీని సమీక్షించడం, రాజ్యాంగ సవరణలను అమలు చేయడం వంటి అంశాలను కూడా పార్టీ సమర్థిస్తున్నట్టు పార్టీ నేత జయంత్ పాటిల్ తెలిపారు. అగ్నిపథ్ పథకాన్ని తప్పకుండా రద్దు చేస్తామని చెప్పారు. రైతులు, యువకులు, మహిళలు, కార్మికులు, కుల గణనకు సంబంధించిన సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు హామీలను తాము ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. పెట్రోలు, డీజిల్‌పై పన్నును పునర్‌వ్యవస్థీకరిస్తామని చెప్పారు.



Next Story

Most Viewed