యాక్టివిస్టులుగా ఫోజు కొట్టి.. యువతిపై గ్యాంగ్‌రేప్

by Mahesh Kanagandla |
యాక్టివిస్టులుగా ఫోజు కొట్టి.. యువతిపై గ్యాంగ్‌రేప్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో దారుణం జరిగింది. పూణేలో ప్రసిద్ధి చెందిన బోప్‌దేవ్ ఘాట్ పైకి వెళ్లిన ఓ యువతిని.. ముగ్గురు దుండగులు చుట్టుముట్టారు. తాము ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులమని చెప్పి బెదిరించారు. ఆ తర్వాత బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లి ఓ చోటా ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు, స్పాట్ నుంచి పారిపోయారు. గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతికి సంబంధించిన బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున మరుసటి రోజు ఉదయమే పోలీసు స్టేషన్‌ ముందు నిరసనకు దిగారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం ఉదయం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడం కోసం రెండు స్కెచ్‌లను కూడా విడుదల చేశారు.

21 ఏళ్ల యువతి తన మిత్రుడితో కలిసి కోండ్వా పరిధిలోని బోప్‌దేవ్ ఘాట్ పైకి వెళ్లింది. అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తుండగా కొందరు ఓ కారులో అక్కడికి వచ్చారు. తాము యాక్టివిస్టులమని పేర్కొంటూ ఆ యువతిపై ప్రశ్నలు గుప్పించారు. ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావని, ఈ ఏరియాలోకి కపుల్స్‌కు అనుమతి లేదని బుకాయించారు. ఆ యువతి తప్పు చేస్తున్నట్టుగా బెదిరించి బలవంతంగా వారి కారు ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి వేరే ఓ చోటుకు కారులో తీసుకెళ్లారు. అక్కడే ఆ యువతిపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి ముందే యువతి మిత్రుడిని చితక్కొట్టారు.

మరుసటి రోజు ఉదయం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోండ్వాకు చెందిన 36 ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేశారు. బాధిత యువతి చెప్పిన వివరాల ప్రకారం పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు నిందితుల ఊహా చిత్రాలను గీసి విడుదల చేశారు. బాధిత యువతి దేహానికి చాలా గాయాలు అయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీనియర్ పోలీసు అధికారులు, క్రైం బ్రాంచీ బృందాలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాయి. క్రైం బ్రాంచ్, డిటెక్షన్ బ్రాంచ్‌ల నుంచి సుమారు పది బృందాలు ఇద్దరు నిందితులను గాలించడానికి రంగంలోకి దిగాయి.

Advertisement

Next Story

Most Viewed