జాగ్రత్త.. ఏ క్షణంలోనైనా..

by  |
జాగ్రత్త.. ఏ క్షణంలోనైనా..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: భారీ వర్షాలకు కృష్ణమ్మ పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో నిండే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి జల కళ వచ్చింది. చిన్న చిన్న నీటి కుంటల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు జలకళ తొణికిసలాడుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా నాగార్జునసాగర్, మూసీ, పులిచింతల ప్రాజెక్టులు కీలకంగా ఉన్నాయి. వీటికి తోడు పానగల్ ఉదయ సముద్రం, డిండి తదితర ప్రాజెక్టులు వీటికి చేదోడువాదోడుగా నిలుస్తాయి. ప్రధానంగా నాగార్జున సాగర్, మూసీ, పులిచింతల ప్రాజెక్టులకు ప్రాధాన్యతను ఉంటుంది. ప్రస్తుతం ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ మూడు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

మరో మూడు రోజుల్లో నిండనున్న సాగర్ ప్రాజెక్ట్..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయినా మూసీ గేట్లు తెరిచారు. రెండు రోజుల క్రితమే రెండున్నర అడుగుల మేర ఐదు గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పలు ఆంక్షలు విధించింది. ప్రాజెక్టు పరిధిలోని పరిసర గ్రామాల ప్రజలతో పాటు నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నదులు, వాగులు, వంకల్లోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా.. చేపల వేట చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి భారీ తరహా ప్రాజెక్టు అయినా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో మీరంతా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది.

నాగార్జున సాగర్‌లో ఇదీ పరిస్థితి..

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 573.6 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా గురువారం నాటికి 265.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 93,630 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,529 క్యూసెక్కులుగా నమోదయింది. గతేడాది ఆగస్టు 20వ తేదీ నాటికి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 587.5 అడుగుల మేర 305.803 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పులిచింతల ప్రాజెక్టులో ఇలా..

పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 15.24 అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.58 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 18,647 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉంది. గత ఏడాది ఆగస్టు 20వ తేదీ నాటికి పులిచింతల ప్రాజెక్టులో 168.239 అడుగుల మేర 35.9097 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సాగర్ సందర్శన పట్ల పోలీసులు ఆంక్షలు..

నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతున్ననందున సాగర్ డామ్ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్న పరిస్థితులలో నాగార్జునసాగర్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరు కూడా సాగర్ డ్యాం గేట్లు నీటి విడుదల దృశ్యాలను చూడడానికి రాకూడదని పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, నందికొండ మున్సిపాలిటీ తీర్మానించారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండి వర్షాలు కురుస్తున్న కారణంగా కరోనా వైరస్ వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కరోనా కట్టడి చేయడానికి సందర్శకులు ఎవరు సాగర్ రావద్దని ఎస్ఐ శీనయ్య తెలిపారు.


Next Story