వివాదంలో మంత్రి కేటీఆర్.. ‘తలసాని’ని ఫాలో అవుతున్నారా.?

by Shyam |
వివాదంలో మంత్రి కేటీఆర్.. ‘తలసాని’ని ఫాలో అవుతున్నారా.?
X

దిశ, సిటీ బ్యూరో : కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఆగమాగం చేస్తున్న ఆపత్కాలం. వైరస్ సోకకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. నేటికీ రోజుకి వేలాది మందికి పాజిటివ్ వస్తోంది. ఒక వైపు దేశ వ్యాప్తంగా కరోనా గైడ్ లైన్స్ ఈ నెలాఖరు వరకు అమల్లో ఉన్నట్లు నిపుణులు చెబుతుంటే మన పాలకులకు అవేమీ పట్టడం లేదు. కరోనా విషయంలో మన ముఖ్యమంత్రి లాగే తయారైంది మన అమాత్యులు, మంత్రుల తీరు. మాస్కు ధరించే విషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రి కేటీఆర్ ఫాలో అవుతున్నారా.? ఎప్పుడూ మాస్కు ధరించే కేటీఆర్.. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాస్కు ధరించకుండా కనిపించారు.

అలాగే, ఇప్పుటికే పలు మీటింగుల్లో తలసాని మాస్కు లేకుండా కనిపించిన విషయం తెలిసిందే. వీరు మాస్కులు ధరించకుండా కరోనా గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తున్నా.. చూసి కూడా పోలీసులు మౌనం వహిస్తున్నారు. ఇదే పోలీసులు.. మాస్కు లేకుండా, బండి మీద పోయేటోళ్లు హెల్మెట్ పెట్టుకోకున్నా, వారిని ఇట్టే గుర్తించి, వారికి ఆన్‌లైన్ జరిమానాలు విధించి తమ ప్రతాపాన్ని చాటుకుంటున్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా, డెల్టా వైరస్ పొరుగు రాష్ట్రాలను గడగడ వణికిస్తోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి వెనుక.. మాములుగా నడుచుకుంటూ వెళ్లినా.. వైరస్ సోకే అవకాశాలెక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నా, మన మంత్రులకు మాత్రం నెత్తికెక్కటం లేదు.

జన సమూహంతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇలాకాలోని రాంగోపాల్ పేట అంబేద్కర్ నగర్‌లో శనివారం 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 330 ఇళ్లకు 330 మంది లబ్దిదారులు, ఒక్కొక్కరి వెంట నలుగురు, ఐదుగురు మొదలుకుని పది మంది దాకా జనాలు వచ్చారు. దీనికి తోడు మంత్రి తలసాని, కార్పొరేటర్ల అనుచరులు, అధికారులు, కళాకారులతో కలిపి దాదాపు వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాస్కులు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించకుండా.. కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు.

ముఖ్య అతిథిగా రాష్ర్ట మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విచ్చేసి లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌లు మాస్కులు ధరించకుండానే మాస్కులతో వేదికపైకి వచ్చిన లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. వేదికపై ఉన్న దాదాపు డజను మంది అతిథుల్లో మంత్రులు కేటీఆర్, తలసాని మినహా మిగిలిన వారంతా మాస్కులు ధరించడం విశేషం. మంత్రి తలసాని కొద్ది రోజుల క్రితం పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సమావేశానికి మాస్కు లేకుండా హాజరుకావటం పార్టీ శ్రేణులు, అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశమైనా మంత్రి వ్యవహార శైలిలో మార్పు లేదా? అని అంబేద్కర్ నగర్ ఇళ్ల పంపిణీ ఫంక్షన్‌కు హాజరైన పలువురు జనం చర్చించుకోవటం కన్పించింది.

Ktr

ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 50 నుంచి 60 మంది బోనాల ఊరేగింపును కూడా నిర్వహించారు. వీరిలో ఎక్కువ మంది మాస్కుల్లేకుండానే వచ్చారు. మంత్రి కేటీఆర్‌కు పదకొండు గంటలకు వేరే అధికారిక కార్యక్రమం ఉన్నందున ఆయన అయిదుగురు లబ్దిదారులకు మాత్రమే ఇళ్లు పంపిణీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత లబ్దిదారులంతా ఇళ్ల కోసం అధికారులపై ఎగబడ్డారు. ప్రజా సంక్షమం, ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేయాల్సిన అమాత్యులే ఈ రకంగా కొవిడ్ గైడ్ లైన్స్ పాటించకపోతే ఎలా.? అని అక్కడకు వచ్చిన వారు చర్చించుకోవటం గమనార్హం.

Next Story

Most Viewed