ఉత్కంఠ భరిత పోరులో టీమిండియా విజయం

by Anukaran |
team india
X

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్‌ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన నాలుగో టీ-20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందింది. 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారత్ 185 పరుగులు చేసింది. ఇక 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొలి నుంచి చెలరేగి ఆడినా.. చివర్లో చేతులెత్తేశారు.

ఓపెనర్ జాసన్ రాయ్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ 9 పరుగులకే ఔట్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన మలన్ (14), బెయిర్ స్టో (25) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మిడిలార్డర్‌లో వచ్చిన బెన్ స్టోక్స్ టీమిండియాను కాస్త టెన్షన్ పెట్టాడు. ధాటిగా ఆడుతూ.. 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత 17వ ఓవర్‌లో షార్దూల్ ఠాకూర్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 140 పరుగుల వద్ద బెన్ స్టోక్స్(46), ఇయాన్ మోర్గాన్‌(4) ఇద్దరి వికెట్లను తీసుకొని ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

ఇదే ఉత్సాహంలో టీమిండియా శామ్ కర్రన్ (3), క్రిస్ జోర్డాన్ (12) వికెట్లను తీసుకుంది. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన ఆర్చర్ కూడా కాస్త టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాడు. 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ బాది ఇంగ్లాండ్‌ను విజయ తీరాల వైపు నడిపించినా.. అది సఫలం కాలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి కేవలం 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలోనే టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం 2-2 ఆధిక్యంలో ఇరు జట్లు ఉండగా.. ఐదో మ్యాచ్‌లో సిరీస్ ఎవరిదో తేలనుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ (12), కేఎల్ రాహుల్ (14) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఇక టూ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ కోహ్లీ సైతం 1 పరుగుకే చేతిలెత్తేశాడు. ఇటువంటి సమయంలో తొలి సారి అంతర్జాతీయ టీ-20లో అరంగేట్రం చేసిన సూర్య కుమార్ యాదవ్ జట్టుకు అండగా నిలిచాడు. డేరింగ్ బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 57 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, 14వ ఓవర్‌లో సామ్ కర్రన్ వేసిన రెండో బంతిని భారీ షాట్ ఆడబోయి డేవిడ్ మలన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 110 పరుగులకు టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (30), శ్రేయస్ అయ్యర్ (37) పరుగులతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. మిడిలార్డర్‌లో వచ్చిన హర్దిక్ పాండ్యా (11), వాషింగ్టన్ సుందర్ (4) పేలవ ప్రదర్శన కనబరిచారు. ఇక చివర్లో వచ్చిన షార్దుల్ ఠాకూర్ 10 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 0 క్రీజులో ఉండగానే ఓవర్లు ముగిశాయి. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది.

Next Story

Most Viewed