హలో డాక్టర్.. ఉచిత టెలీ కన్సల్టేషన్ సేవలు

by Shyam |
Hello Doctor
X

దిశ, ఫీచర్స్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చాలామంది ప్రజల్లో ఎన్నో అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి. ఒంట్లో అలసట, కాస్త జ్వరంగా ఉన్నా కరోనా వచ్చిందేమోనని భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ‘డాక్టర్’ సలహా పాటించడం ఉత్తమం. అయితే లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన పేదలు, డాక్టర్ ఫీజు గురించి ఆలోచించి వైద్య సహాయానికి వెనకాడతున్నారు. అలాంటి వారికోసం భువనేశ్వర్ ఆధారిత స్టార్టప్ కంపెనీ లైఫ్‌లింక్, బెంగళూరుకు చెందిన AIDSO అనే విద్యార్థి సంస్థ. కొవిడ్- 19 లక్షణాలు ఉన్నవారికి ఉచిత టెలి-కన్సల్టేషన్ సదుపాయం కల్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొవిడ్ గురించే కాదు, ఇతరత్రా వ్యాధుల కోసం కూడా ప్రజలు ఇల్లు దాటే పరిస్థితి లేదు. మరోవైపు వైద్యులంతా కొవిడ్ ట్రీట్‌మెంట్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో AIDSO అనే విద్యార్థి సంస్థ మే 22 నుంచి కర్ణాటక ప్రజలకు ఉచిత టెలి-క్లినిక్ ‘హలో డాక్టర్’ను ప్రారంభించింది. ఈ టెలి-క్లినిక్ కోసం మొత్తం 35-40 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితో పాటు, కొవిడ్ -19, బ్లాక్ ఫంగస్, ప్రాథమిక చికిత్స కోసం నిపుణుల నుంచి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఒంటరితనం, ఇతర సమస్యల వల్ల బాధపడుతున్న వారికి కౌన్సిలింగ్ కూడా లభిస్తుంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9-10, సాయంత్రం 4-5 మధ్యలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఇక ఆదివారం మాత్రం మూడు సెషన్లు (ఉదయం 10-11; మధ్యాహ్నం 12 గం -1; సాయంత్రం 5-6) ఉంటాయి. అపాయింట్‌మెంట్ కోసం 9164220387, 9035762866, 8951824630, 9538627750 నెంబర్లలో సంప్రదించొచ్చు. అంతేకాదు బెంగళూరు స్టూడెంట్ కమ్యూనిటీకి 4,000 మందికి పైగా విద్యార్థులు వివిధ జట్లుగా విడిపోయి, కొవిడ్ సమయంలో అవసరమైన వారికి చేతనైన సాయం అందిస్తున్నారు. ఈ బృందాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా 7760161751లో సంప్రదించొచ్చు.

డిజిటల్ క్లినిక్

భువనేశ్వర్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘లైఫ్‌లింక్’(Lyflink) గ్రామీణ, పట్టణ ప్రాంత కొవిడ్ బాధితులకు వచ్చే సందేహాలు, సమస్యల నివృత్తి కోసం వైద్య నిపుణులతో కనెక్ట్ చేయడానికి సహాయం చేస్తోంది. ఇందులో ఆర్థోపెడిక్స్, న్యూరాలజిస్టులు, ఆంకాలజిస్టులు, పల్మోనాలజిస్టులతో పాటు, నర్సులతో సహా 400 మంది నిపుణులు ఉన్నారు. ప్రస్తుతం లైఫ్‌లింక్ ఐదు డిజిటల్ క్లినిక్‌లను కలిగి ఉంది. కాస్త ఆర్థికంగా మెరుగైన వారికి కన్సల్టేషన్ చార్జీలు నామమాత్రం ఉండగా.. ఒడిశా గ్రామీణ పేద రోగులకు ఉచితంగానే సేవలందిస్తోంది. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో COVID సోకిన రోగులు నిపుణులతో సంప్రదింపులు జరపడం కష్టమని గ్రహించింది ఈ బృందం. మూడు వారాల క్రితం హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌లో COVID-14, పోస్ట్ COVID కేర్ అనే రెండు ప్యాకేజీలతో ముందుకు వచ్చింది. COVID-14 ప్యాకేజీ కింద, కరోనా సోకిన రోగి ఆరోగ్య పరిస్థితిని 14 రోజుల ఐసోలేషన్ పర్యవేక్షిస్తూ.. ఉచిత మందులు, పరీక్షలు కూడా అందిస్తారు. అదేవిధంగా పోస్ట్ కొవిడ్ కేర్ ప్యాకేజీలో, రోగులు కరోనా నుంచి కోలుకోవడానికి మందులు, వ్యాయామాలు, ఆహారం గురించి అవగాహన కల్పిస్తారు.

Next Story

Most Viewed