వేతన జీవులకు ఆరోగ్య భద్రత కల్పించరా?

by Ravi |   ( Updated:2024-09-04 01:16:14.0  )
వేతన జీవులకు ఆరోగ్య భద్రత కల్పించరా?
X

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు అక్రమాల జబ్బు సోకి మరుగున పడింది. గత మూడేళ్లుగా ఈ‌హెచ్‌ఎస్ పథకం కింద వైద్య సేవల కోసం వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు కొన్ని ఆస్పత్రులు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి.

ఈహెచ్‌ఎస్ పథకానికి సంబంధించి ఆసుప్రతులకు వందల కోట్ల వరకు బకాయిలు ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ పథకం అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రీమియంతో కూడిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందుకుగాను ప్రతినెల మూల వేతనంలో 1-2 శాతం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

సాంత్వన ఇవ్వని పథకం

ఉమ్మడి రాష్ట్రంలో 1972 నుంచి అమలవుతున్న సమీకృత వైద్య సహాయ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు డబ్బులు చెల్లించి వైద్యం పొంది చికిత్స అనంతరం బిల్లులు సమర్పిస్తే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొదట ఉద్యోగులకు, పెన్షనర్లకు అమలు చేసిన ఈ పథకాన్ని 2005 మార్చి నుంచి ఉత్తర్వు నెంబర్ 74 ద్వారా ఉపాధ్యాయులకు వర్తింపజేసింది. కానీ పథకం ఉద్యోగులకు స్వాంతన చేకూర్చలేకపోయింది. ఆస్పత్రుల నుంచి బిల్లులు పొందడం తర్వాత వాటిని సమర్పించడం, బిల్లులు మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం నెలల తరబడి ఎదురు చూడడం ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల మంజూరు కోసం తోటి ఉద్యోగులు అధికారులకు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగులు వైద్య చికిత్సల కోసం వచ్చిన మొత్తం డబ్బులు కాకుండా అందులో సగం వరకే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. గుండె జబ్బులు నరాలు, మెదడు సంబంధిత శాస్త్ర చికిత్సలు, డెంటల్ చికిత్సలకు ఎంత ఖర్చయినా ఉత్తర్వు నెంబర్ 397 ప్రకారం రెండు లక్షల రూపాయల వరకే పరిమితి ఉండడంతో ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షగా మారాయి. ఈ వైద్య సేవల పథకం కేవలం కొన్ని ఆసుపత్రులకే పరిమితం కావడంతో ఉచిత వైద్య సేవల పథకాన్ని తేవాలని ఉపాధ్యాయ నేతలు గత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 2014 నవంబర్ 1 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు పరుస్తోంది. కానీ ప్రయోజనాలు అంతంత మాత్రమే.

బకాయిలు ఉండటంతో..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు గత తొమ్మిదేళ్లుగా గత ప్రభుత్వం అమలు పరిచిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం సరైన ఆరోగ్య భరోసా ఇవ్వలేకపోతున్నది. ఈ పథకం కింద ప్రవేశపెట్టిన హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్సలు పొందే వీలు ఉన్నా కూడా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం వల్ల ఉద్యోగులు సరైన వైద్యం పొందలేకపోతున్నారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు తమకు లాభం కలిగించే ట్రీట్మెంట్ మాత్రమే దీని కింద అందిస్తున్నాయి. ఏ ఆస్పత్రిలో ఏ ఏ చికిత్సలు చేస్తున్నారు అనే అంశంపై అవగాహన లేక ఉద్యోగులు ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమికంగా ఓపీ స్థాయిలో చూపించుకునేందుకు ఆయా జిల్లాలలో 14 వెల్‌నెస్ సెంటర్‌లను ఏర్పాటు చేసినా సరైన వైద్య పరికరాలు యంత్రాలు లేక, మందులు అందక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల బకాయిలు పడి, వాటిని చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అనుమతించడం లేదు. రాష్ట్రంలో ఈహెచ్ఎస్ పథకం సరిగా అమలు కాకపోవడంతో దానికి సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు పరుస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ఈ పథకాన్ని పొడిగిస్తూ ఈ రెండు ఆరోగ్య పథకాల ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు నామ మాత్రం వైద్య సేవలను అందిస్తున్నారు.

ఉపాధ్యాయులు కోరినట్టుగా..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3.19 లక్షల ఉద్యోగులు, 1.09 లక్షలు ఉపాధ్యాయులు, 2.50 లక్షల మంది పెన్షనర్లు, వీరిపై ఆధారపడిన 15 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడానికి ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మూల వేతనంలో 1-2 శాతం సొమ్మును చందాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాలు గతంలోనే సంసిద్ధత ప్రకటించాయి. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్న నూతన ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరినట్టు ఉద్యోగుల జీతాల నుండి కొంత శాతం ప్రీమియం రూపంలో వసూలు చేసి వచ్చిన మొత్తం సొమ్ముకు అంతే మొత్తం సొమ్మును ప్రభుత్వం ఇస్తూ ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తే బాగుంటుంది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు పరిస్తే ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు.

అంకం నరేష్

63016 50324

Advertisement

Next Story