వేములవాడలో కారు బీభత్సం

by Sridhar Babu |
వేములవాడలో కారు బీభత్సం
X

దిశ, వేములవాడ టౌన్ : వేములవాడ- సిరిసిల్ల ప్రధాన రహదారిలోని రాజధాని దాబా వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారులో ఓ వ్యక్తి జగిత్యాల నుంచి సిరిసిల్ల వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో కారు రాజధాని దాబా సమీపంలోకి రాగానే అతివేగంగా వచ్చి అదుపుతప్పి పక్కనే ఉన్న కిరాణా దుకాణం వైపు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో దుకాణం ముందు నిలిపి ఉంచిన మూడు ద్విచక్ర వాహనాలతో పాటు కారు ముందు వెళ్తున్న మరో ఆటో ధ్వంసమయ్యాయి.

ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే కారులో ఉన్న ముగ్గురు చిన్న పిల్లలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా కారు డ్రైవర్ పీకల్లోతు మద్యం తాగి ఉన్నాడని, ఈ ప్రమాదానికి ముందే ఫాజుల్ నగర్ వద్ద ప్రమాదం చేసి కుక్కను చంపి దానిని కారులో తీసుకువచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు పిల్లలతో పాటు కారును, ధ్వంసం అయిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story