గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

by Sridhar Babu |
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
X

దిశ, ముషీరాబాద్ : ఓ వ్యక్తిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లోయర్ ట్యాంక్ బండ్ గోశాల వద్ద శనివారం రాత్రి 11 గంటల సమయంలో దాదాపు 40 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు హత్య చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ గోశాల నుంచి మారుతీ నగర్ కు వెళ్లే దారిలో ఆటోపై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్ ఏసీపీ మొగులయ్య, దోమలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని పరిశీలించారు.

క్లూస్ టీంను పిలిపించి ఆధారాలను సేకరించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. మద్యం తాగించి ఇక్కడకు తీసుకువచ్చి అతని మెడపై తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు దోమలగూడ పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తిని దోమలగూడ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గురైన వ్యక్తిని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చి హత్య చేశారు, అతన్ని హత్య చేసిన వారు స్థానికులేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు దోమలగూడ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story