దేశంలో ఒక్కరోజే 62వేల కేసులు

by  |
దేశంలో ఒక్కరోజే 62వేల కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి కార్చిచ్చులా వ్యాపిస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లోనే 5 లక్షల పాజిటివ్‌లు నమోదయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య ఏకంగా 60 వేల మార్కు దాటింది. శుక్రవారం ఉదయం బులెటిన్ వెల్లడించేసరికి గడిచిన 24 గంటల్లో నమోదైన 62,498 కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,27,034కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 886 మంది మరణించారు. కొత్తగా నమోదైన కరోనా మరణాలతో కలిపి దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 41,585కు చేరిందని ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతుండగా కొత్తగా నమోదవుతున్న కేసుల పరంగా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారిలో 13 లక్షల 78 వేల మంది కోలుకోగా ప్రస్తుతం 6లక్షల 7 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 10,483 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 4,90,262కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో మరణించిన 300 మందితో కలుపుకొని మొత్తం మరణించిన వారి సంఖ్య 17,092కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో కొత్తగా నమోదైన 1192 కొత్త కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,42,723కి చేరింది.

ఇక్కడ కొత్తగా 23 కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4082 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. తమిళనాడులో 24 గంటల్లో 5880 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,85,024కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 119 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4690కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,171కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 89 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకి 1842 మంది ప్రాణాలు కోల్పోయారు.


Next Story

Most Viewed