పోలీసులకు కరోనా కలవరం

by vinod kumar |
పోలీసులకు కరోనా కలవరం
X

దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా వైరస్ కాటుకు పోలీసులు కూడా కలవరపడుతున్నారు. కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది, పారిశుద్య సిబ్బందితో పాటు పోలీసులకూ కరోనా భయం పట్టుకుంది. ఇప్పటికే నగరానికి చెందిన ఓ కానిస్టేబుల్ కరోనా కారణంగా మరణించగా, మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు 100 మందికి ఇన్‌ఫెక్షన్ సోకినట్లు అనధికార సమాచారం. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కొద్దిమంది పోలీసులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జనతా కర్ఫ్యూ మొదలు లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు ఇప్పటివరకూ పని ఒత్తిడి ఉంటే తాజాగా కరోనా వైరస్ భయం పట్టుకుంది.

దాదాపు 100 మందికి పాజిటివ్..

పోలీసులకు కరోనా భయం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం కాకుండా, జిల్లాల్లోనూ నెలకొంది. నగరంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు స్టేషన్లలో పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కుల్సుంపురా పీఎస్ పరిధిలో ఓ కానిస్టేబుల్ మరణించగా, దాదాపు 100 మంది పోలీసులకు పాజిటివ్ నిర్థారణ అయినట్టు సమాచారం. బంజారాహిల్స్ పీఎస్‌లో 15 మందికి, ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో నలుగురికి పాజిటివ్ రావడంతో గాంధీ, నేచర్ క్యూర్ తదితర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చాదర్ ఘాట్, చిలకలగూడ, చిక్కడపల్లి, బాలాపూర్, టప్పాచపుత్ర, ఛత్రినాక, బహదూర్ పురా, మీర్ చౌక్, కామాటిపురా, కాలాపత్తార్, డబీర్ పురా, అఫ్జల్ గంజ్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బందికి కూడా కరోనా ఇన్‌ఫెక్షన్ సోకినట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఓ పోలీసుకు కూడా పాజిటివ్ వచ్చింది.

భయాందోళన మధ్యనే విధులు..

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ 150కుపైగా కరోనా కేసులు నమోదవుతుండడంతో కంటైన్‌మెంట్ జోన్ల పర్యవేక్షణ, క్వారంటైన్ కేంద్రాలు, గాంధీ ఆసుపత్రి దగ్గర విధులు నిర్వర్తించే పోలీసులు కరోనా భయం కాస్త ఎక్కువగా ఉంది. రిస్కు ఎక్కువ ఉన్నందునే భయం కూడా ఆ స్థాయిలోనే ఉంది. జన సమ్మర్ధం కలిగిన ప్రాంతాల్లో విధులు చేపట్టడం వారి భయాన్ని ఇంకొంత పెంచుతోంది. కేసుల స్థాయి ఇలాగే కొనసాగితే మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలు కూడా లేకపోలేదంటూ వారిలో వారికి చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed